లోక్సభలో చంద్రయాన్-3 మిషన్ సక్సెస్పై చర్చ సందర్బంగా బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ ఎంపీ రమేష్ బిధురికి బీజేపీ శుక్రవారం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు 25 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆయనను పార్టీ కోరింది.
ముస్లిం ఎంపీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రమేష్ బిధురిని స్పీకర్ ఓంబిర్లా తీవ్రంగా మందలించారు. మరోసారి ఇలా జరిగితే కఠిన చర్యలు చేపడతామని ఆయనను హెచ్చరించారు. తమ ఎంపీ ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ సభాపక్ష ఉపనాయకుడిగా రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ లోక్ సభకు క్షమాపణలు కూడా చెప్పిన్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించారు.
కాగా, బీజేపీ ఎంపీ రమేష్ బిధురి తనపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల పట్ల బీఎస్పీ నేత, లోక్సభ ఎంపీ డానిష్ అలీ మనస్తాపానికి లోనయ్యారు.బీజేపీ ఎంపీపై చర్యలు చేపట్టని పక్షంలో తాను లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. చంద్రయాన్-3 మిషన్ సక్సెస్పై చర్చ సందర్భంగా డానిష్ అలీపై బిధూరి అనుచిత వ్యాఖ్యలు చేశారు. డానిష్ అలీని ఉగ్రవాది అంటూ విరుచుకుపడ్డారు.
బిధురి వ్యాఖ్యలపై తాను లోక్సభ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశానని బీఎస్పీ ఎంపీ తెలిపారు. లోక్సభ ప్రసంగంలో రమేష్ బిధూరి తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, తనను ముస్లిం ఉగ్రవాదిగా సంభోదించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్గా మీ నేతృత్వంలో నూతన పార్లమెంట్ భవనంలో ఇలా జరగడం దురదృష్టకరమని లేఖలో ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు.