దేశంలో మహిళలకు రాజ్యాధికారంలో పెద్దపీట వేసి మహిళలను గౌరవించాలని ఒక ఆలోచనతో బీజేపీ ముందుకు సాగుతుందని ఆ పార్టీ జాతీయ ఓబిసి అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే.లక్ష్మణ్ తెలిపారు. అక్టోబర్ 1న ప్రధాని మోదీ బహిరంగ సభ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సన్నాహక సమావేశానికి మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుత గత ప్రభుత్వాలు పాలకులు మహిళా బిల్లు విషయంలో అనేక ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నాలన్నీ సఫలీకృతం కాలేదని గుర్తు చేశారు. 1996లో దేవగౌడ, వాజపేయి, అద్వానీ ఇలాంటి వారు పార్లమెంట్లో ఈ విషయాన్ని ప్రస్తావించినా సాధించలేకపోయారని పేర్కొన్నారు.
అయితే, ప్రధాని నరేంద్ర మోదీ నవభారత నిర్మాణంలో నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనంలో మొదటి బిల్లు మహిళా బిల్లు ప్రవేశపెట్టారని, రాజ్యసభలో కూడా మొదటి బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకమని ఆయన విమర్శించారు.
గతంలో మొక్కుబడిగా మహిళా బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ వారి వెంట ఉన్న ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకించి అడ్డుకుంటే అప్పుడు నోరు మెదపలేదని ధ్వజమెత్తారు. దేశ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా అనుకున్నది సాధించే గొప్ప వ్యక్తి ప్రధాని మోదీ అని కొనియాడారు.
ప్రధాని మోదీ అనుకున్నది కచ్చితంగా చేస్తాడని, చేసేదే చెబుతాడని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. క్లిష్టమైనటువంటి 370 ఆర్టికల్ రద్దు, జిఎస్టి, నోట్ల రద్దు లాంటి ఎన్నో ప్రయోజనాలను దేశ ప్రజల కోసం ప్రవేశపెట్టిన మోదీ మహిళా బిల్లు రిజర్వేషన్ కూడా ఎవరు అడ్డు చెప్పకుండా పార్లమెంటులో అటువంటి వాతావరణం సృష్టించి బిల్లు ప్రవేశ పెట్టారని ఆయన తెలిపారు.