ఈసారి ఎలాగైనా సరే హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్, ఎట్టి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని కానివ్వకూడదని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో పలు ప్రముఖ సంస్థలు రిలీజ్ చేస్తున్న ఎన్నికల సర్వేలతో ఎక్కువగా తెలంగాణలో కాంగ్రెస్దే అధికారమని తేల్చేశాయి.
అయితే, తాజాగా మరో ప్రముఖ సంస్ ఇండియా టుడే-సీఓటర్ విడుదల చేసిన సర్వేలో హ్యాంగ్ అసెంబ్లీ తప్పక పోవచ్చని తెలుస్తున్నది. ఒక విధంగా బిజెపి సహితం హ్యాంగ్ అసెంబ్లీ కోరుకొంటున్నది. అదే జరిగితే ప్రభుత్వం ఏర్పాటులో తాము కీలక పాత్ర వహించవచ్చని ఎదురు చూస్తున్నది.
ఇండియా టుడే- సీ ఓటర్ సర్వేను నిశితంగా పరిశీలిస్తే.. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య నువ్వా- నేనా అన్నట్లుగా పోటీ ఉందని స్పష్టంగా అర్థం అవుతోంది. అంతేకాదు కేసీఆర్ పాలనా వైఫల్యాలను సైతం సీఓటర్ సర్వే నిశితంగా చర్చించి.. వివరించింది కూడా.
కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవిస్తుందని చెబుతున్నా ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 60 సీట్లు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. అదే జరిగితే రెండో స్థానంతో సరిపెట్టుకున్న బీజేపీ మద్దతుతోనే, కాంగ్రెస్ నుండి ఫిరాయింపులను ప్రోత్సహించే బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది.
- 119 అసెంబ్లీ సీట్లు ఉన్న తెలంగాణాలో ఈ సారి కాంగ్రెస్ పార్టీకి 54 సీట్లు వస్తాయని ఇండియా టుడే-సీ ఓటర్ సర్వే తేల్చింది.
- 2018 ఎన్నికల్లో 88 సీట్లను గెలుచుకున్న బీఆర్ఎస్.. ఈసారి కేవలం 49 స్థానాలతోనే సరిపెట్టుకుంటుందని వెల్లడించింది.
- గత ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానంలోనే గెలిచిన బీజేపీ ఈ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకునే అకాశం ఉందని వివరించింది.
- 2018 ఎన్నికల్లో ఇతరులు 11 మంది గెలవగా ఈ ఎన్నికల్లో 8 మంది వరకు గెలవొచ్చని అంచనా వేసింది.
పెరగనున్న కాంగ్రెస్ ఓటింగ్ షేర్..!
- ఇక ఓటింగ్ షేర్ విషయానికొస్తే కాంగ్రెస్ బలం భారీగా పెరగనున్నట్లు తెలిపింది ఇండియా టుడే – సీ ఓటర్ సర్వే. గత ఎన్నికల్లో 28 శాతం ఓట్లను దక్కించుకున్న కాంగ్రెస్… ఈసారి 39 శాతానికి పెరుగుతుందని వెల్లడించింది. గతంతో పోల్చితే 11 శాతం ఓట్లు పెరుగుతాయని సర్వేలో వెల్లడించింది.
- 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 47 శాతం ఓట్లు వస్తే… వచ్చే ఎన్నికల్లో 9 శాతం తగ్గి 38 శాతానికి పడిపోవచ్చని తెలిపింది.
- 2018 ఎన్నికల్లో బీజేపీకి 8 శాతం ఓట్లు దక్కగా… రాబోయే ఎన్నికల్లో ఈ సంఖ్య రెండింతలు అవుతుందని పేర్కొంది. 16 శాతానికి పెరుగుతుందని వివరించింది.
- ఇతరుల ఓట్ల శాతం 18 నుంచి 7 శాతానికి పడిపోతుందని అంచనా వేసింది.