మద్యం కుంభకోణం కేసుల్లో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి ఆప్ నేత మనీశ్ సిసోడియాకు సుప్రీం కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుల్లో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
ఈ కేసులో నగదు లావాదేవీలు జరిగినట్టు కొన్ని ఆధారాలున్నాయని దర్యాప్తు సంస్థ చూపించిందని సుప్రీం కోర్టు తెలియజేసింది. రూ.338 కోట్ల నగదు బదిలీకి సంబంధించి ఇప్పటికే విచారణ ప్రారంభమైనందున ఈ దశలో బెయిల్ ఇవ్వడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది.
అయితే ఈ కేసు విచారణను 68 నెలల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఒకవేళ విచారణ నిదానంగా సాగితే … సిసోడియాకు మూడు నెలల్లోపు మళ్లీ బెయిల్కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.
మరోవంక, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం సమన్లు వెలువరించింది. గురువారం (నవంబర్ 2 వ తేదీ) విచారణకు రావాల్సిందని తెలిపింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈ ఏడాది ఫిబ్రవరి 26 న మనీశ్ సిసోడియాను సిబిఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మార్చి 9న ఈడీ కూడా సిసోడియాపై కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన కస్టడీపై తీహార్ జైలులో ఉన్నారు.
ఈ కేసుల్లో బెయిల్ కోసం కింది కోర్టుల్లో ఊరట లభించక పోవడంతో సిసోడియా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సీబీఐ, ఈడీ కేసుల్లో వేర్వేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై ఇటీవల దర్యాప్తు చేపట్టిన సుప్రీం కోర్టు ధర్మాసనం …. దర్యాప్తు సంస్థలకు పలు ప్రశ్నలు సంధించింది.
అయితే ఈ కేసు విచారణ సందర్భంగా తాము లేవనెత్తిన చాలా అంశాలకు ఎవరి నుంచి సరైన సమాధానం రాలేదని కోర్టు ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేసింది. కొన్నింటికి సమాధానం ఇచ్చినా అవి సంతృప్తికరంగా లేవని పేర్కొంది.