చెన్నై నగర వరదల నిర్వాహణ పనుల ప్రాజెక్టుకు సంబంధించి రూ 561.29 కోట్ల ప్రణాళికకు ప్రధాని నరేంద్ర మోదీ అనుమతిని ఇచ్చారు. చెన్నై బేసిన్ ప్రాజెక్టు పరిధిలో సంబంధిత పనులు జరుగుతాయని హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ప్రస్తుత మిచౌంగ్ తుపాన్తో చెన్నై భారీ స్థాయిలో వరదలతో అతలాకుతలం అయిపోతున్న దశలో ఈ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన వెలువరించింది.
ఇంతకు ముందు కూడా భారీ వర్షాలు వరదలతో చెన్నైలో వరదలు తలెత్తాయి. ఎక్కువగా తుపాన్ల తాకిడి ప్రాంతంగా ఉంటూ వస్తున్న ఈ నగరానికి సరైన శాశ్వత పరిష్కారానికి ఈ ప్రాజెక్టు ఉపకరిస్తుందని భావిస్తున్నారు. దేశంలో పలు మెట్రోపాలిటన్ నగరాలలో ఇటీవలి కాలంలో భారీ వర్షాలు వరదల పరిస్థితి ఏర్పడుతోంది.
గడిచిన ఎనిమిదేళ్లలో చెన్నై ఇప్పటికీ మూడు సార్లు భారీ స్థాయి ఉధృత వరదల స్థితిని ఎదుర్కొందని కేంద్ర హోం మంత్రి తమ ప్రకటనలో తెలిపారు. ఆకస్మిక వరదలతో పలు నగరాలలో పరిస్థితి దిగజారుతోందని , ఇది జనజీవితాలను దెబ్బతీస్తోందని , పరిస్థితిని గట్టెక్కించేందుకు ఇక తిరుగులేని ప్రణాళికలు రూపొందించుకోవల్సి ఉందని మంత్రి తెలిపారు.
ప్రధాని మోదీ నిర్మాణాత్మక ఆలోచనల క్రమంలో ఇప్పుడు చెన్నై నగరానికి తొలిసారిగా ఈ ఇంటిగ్రేటెడ్ అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ కార్యకలాపాల పనులకు నిధులు మంజూరు అయ్యాయని చెప్పారు. దీని మేరకు చెన్నై పరిసరాలల్లోని వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని చక్కదిద్దేందుకు కార్యక్రమాలు చేపడతారు.
తుపాన్ వెళ్లినా వీడని దుస్థితి
ఇలా ఉండగా, మహానగరం చెన్నైలో తుపాన్ భారీ వర్షాల అనంతర వరద ప్రభావం మరింత తీవ్రస్థాయికి చేరింది. గురువారం కూడా చెన్నై పలు వీధులలో , ప్రధాన కూడళ్లలో వరద నీరు వచ్చి చేరింది. పలు నివాసాలు నీట మునిగి, దాదాపు ఐదారు రోజులుగా జనం నానా యాతనలకు గురవుతున్నారు.
భారీ కుండపోత వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయితే చెన్నై శివారు ప్రాంతాలలో జలదిగ్బంధ పరిస్థితి వీడకుండా సాగుతోంది. సైక్లోన్ మిగ్జాంతో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్లు వంటి చోట్ల వరదలు ప్రజలకు నరకం చూపాయి. మంగళవారం తుపాన్ ఆంధ్రప్రదేశ్ తీరం దాటింది.
అంతకు ముందు ఆ తరువాత చెన్నైలో కుండపోత వర్షాలు పడ్డాయి. చెన్నై దాదాపుగా మరో సముద్రాన్ని తలపించింది. ఇది నిజానికి ఈ నగరానికి ఇక ముందు తలెత్తే పెను జల ప్రమాదాన్ని సూచిస్తోందని నిపుణులు తెలిపారు. స్టాలిన్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటూ , సహాయక చర్యలను వేగవంతం చేసింది.