ప్రజల నుంచి లూటీ చేసిన ప్రతి పైసాను వెనక్కి రప్పిస్తామని, ఇది మోదీ గ్యారెంటీ అని ‘ఎక్స్’ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. జార్ఖండ్ కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహుతో సంబంధం ఉన్న ఒక వ్యాపార సంస్థకు చెందిన వేర్వేరు ప్రదేశాల నుంచి కోట్లాది రూపాయల నగదు ఐటీ దాడుల్లో పట్టుబడింది. ఈ కథనాన్ని తన పోస్ట్కు మోదీ జత చేశారు.
ఈ కరెన్సీ నోట్ల గుట్టలను దేశప్రజలంతా చూసిన తర్వాత ఆ పార్టీ నాయకుల నిజాయితీ, చెప్పే ఉపన్యాసాలు వినాలని ఎద్దేవా చేశారు. ప్రజల నుంచి లూటీ చేసిన ప్రతి పైసాను వాపలు చేయాల్సిందేనని, ఇది మోదీ గ్యారెంటీ అంటూ పలు ఇమోజీలతో మోదీ హెచ్చరించారు. బీరువాల నిండా నోట్ల కట్టలున్న ఒక కథనం కూడా ట్వీట్కు ఆయన జోడించారు.
ఒడిశా, జార్ఖండ్లలో ఐటీ శాఖ గురువారం జరిపిన పలు దాడుల్లో వివిధ మద్యం తయారీ సంస్థలకు చెందిన రూ.300 కోట్లు పట్టుబడ్డాయి. పన్ను ఎగవేత ఆరోపణలపై బుధవారం నుంచి సుమారు అర డజనుకు పైగా సంస్థల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయి.
కేవలం ఒడిశాలోని బౌద్ధ్, రాయడిహ్, సంబల్పూర్, బాలంగీర్ జిల్లాల్లోని బీడీపీఎల్ పర్మిసెస్, జార్ఖాండ్లోని రాంచీ, లోహర్డగ జిల్లాల్లో రూ.150 కోట్లు పట్టుబడినట్టు అధికారులు చెబుతున్నారు. బీడీపీఎఎల్ యజామానులతో సన్నిహత సంబంధాలున్నాయన్న కారణంగా కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంటిపై కూడా అధికారులు దాడులు జరిపినట్టు సమాచారం.
ఇంకా ఆ కంపెనీలపై ఐటీశాఖ తనిఖీలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తొలి రోజు సుమారు 50 కోట్ల క్యాష్ను సీజ్ చేశారు. ఇప్పుడు ఆ అమౌంట్ 200 కోట్లు దాటింది. ఆ మొత్తాన్ని లెక్కపెట్టేందుకు మూడు డజన్ల కౌంటింగ్ మెషీన్లు వాడారు. సామర్థ్యానికి తగ్గ లేనటువంటి మెషీన్లు ఉండడం వల్ల ఇంకా కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోంది.