టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా క్రీడలలో ప్రభుత్వం అందజేసే రెండో అత్యున్నత పురస్కారమైన అర్జున అవార్డును అందుకున్నాడు. గత కొన్నాళ్లుగా టీమిండియా తరఫున నిలకడగా రాణిస్తున్న షమీ గత నాలుగేండ్లుగా అంతర్జాతీయ స్థాయిలో 127 వికెట్లు పడగొట్టాడు.
ఇక గతేడాది భారత్ వేదికగానే జరిగిన వన్డే వరల్డ్ కప్లో 24 వికెట్లు సాధించాడు. ఇప్పటిదాకా భారత క్రికెట్ జట్టులో అర్జున అవార్డు అందుకున్నవారిలో షమీ 58వ క్రికెటర్. ప్రస్తుతం టీమిండియాలో ఉన్న క్రికెటర్లలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్యా రహానే, అశ్విన్, ఛతేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజాలు కూడా ఈ జాబితాలో ఉన్నారు.
అర్జున అవార్డు అందుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన షమీ ఇది ఒక కలగా అభివర్ణించాడు. ‘‘అర్జున అవార్డు అందుకోవడం ఒక కల. చాలామందికి వారి జీవిత కాలం మొత్తంలో కూడా ఈ అవార్డు దక్కదు. అలాంటిది నాకు దక్కడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను.‘‘ అని అవార్డుల ప్రదానోత్సవానికి ముందు షమీ చెప్పాడు. కాగా షమీతోపాటు మొత్తంగా 26 మంది క్రీడాకారులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డులను అందుకున్నారు.
మహ్మద్ షమీ(క్రికెట్), అదితి గోపీచంద్ స్వామి(ఆర్చరీ), ఓజస్ ప్రవీణ్ డియోటలే (ఆర్చరీ), శ్రీశంకర్ మురళి (అథ్లెటిక్స్), పారల్ చౌదరీ (అథ్లెటిక్స్), మహమ్మద్ హుసాముద్దీన్(బాక్సింగ్), ఆర్ వైశాలి(చదరంగం), అనుష్ అగర్వాలా (గుర్రపుస్వారీ), దివ్యాకృతి సింగ్(ఈక్వెస్ట్రియన్ డ్రెస్సేజ్), దీక్షా దాగర్(గోల్ఫ్), కృష్ణ బహదూర్ పాఠక్(హాకీ), పుఖ్రంబం సుశీల చాను (హాకీ),
పవన్ కుమార్(కబడ్డీ), రీతు నేగి(కబడ్డీ), నస్రీన్ (కో-కో), మిస్ పింకీ(లాన్ బౌల్స్), ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ (షూటింగ్), ఈషా సింగ్(షూటింగ్), హరీందర్ పాల్ సింగ్ సంధు (స్క్వాష్), అహికా ముఖర్జీ (టేబుల్ టెన్నిస్), సునీల్ కుమార్(రెజ్లింగ్), యాంటీమ్ పంఘల్(రెజ్లింగ్), శ్రీమతి నౌరెమ్ రోషిబినా దేవి(వుషు), శీతల్ దేవి (పారా అర్చరీ), ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి (బ్లైండ్ క్రికెట్), శ్రీమతి ప్రాచీ యాదవ్(పారా కనోయింగ్) అర్జున అవార్డులను అందుకున్నారు.