భారత్, మయన్మార్ సరిహద్దులో కంచెను కేంద్రం త్వరలో ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా శనివారం ప్రకటించారు. దేశంలోకి స్వేచ్ఛాయుత రాకపోకల నిరోధానికి బంగ్లాదేశ్తో సరిహద్దులో కంచె ఏర్పాటు చేసిన వైనాన్ని అమిత్ షా ఈ సందర్భంగా ఉదహరించారు.
భారత్, మయన్మార్ సరిహద్దు సమీపంలో నివసించే జనం 16 కిలోమీటర్ల దూరం దాటి పరస్పర భూభాగంలోకి ప్రవేశించేందుకు వీలు కల్పిస్తున్న ‘స్వేచ్ఛా రవాణా వ్యవస్థ (ఎఫ్ఎంఆర్)’ ఈ ప్రకటనతో త్వరలో ముగియగలదు.
గువాహటిలో అస్సాం పోలీస్ కమాండోల పాసింగ్ ఔట్ పరేడ్ను ఉద్దేశించి అమిత్ షా ప్రసంగిస్తూ, ‘బంగ్లాదేశ్తో సరిహద్దులో వలె మయన్మార్తో భారత్ సరిహద్దులో త్వరలో కంచె ఏర్పాటు కాగలదు’ అని తెలియజేశారు. ‘బంగ్లాదేశ్తో సరిహద్దులో వలె మయన్మార్తో గల స్వేచ్ఛ సరిహద్దులో కంచె ఏర్పాటు చేసేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం నిశ్చయించిందని అస్సాంలోని మా మిత్రులకు చెప్పదలిచాను’ అని అమిత్ షా తెలిపారు.
‘మయన్మార్తో గల భారత్ స్వేచ్ఛా రాకపోకల వ్యవస్థ (ఎఫ్ఎంజి) ఒప్పందంపై కూడా ప్రభుత్వం పునఃపరిశీలిస్తోంది. భారత్లోకి స్వేఛ్చా రాకపోకలు త్వరలో ముగియగలవు’ అని మంత్రి చెప్పారు. మయన్మార్తో భారత్కు 1643 కిలో మీటర్ల నిడివి గల సరిహద్దు ఉన్నది. అది మిజోరామ్, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ మీదుగా సాగుతుంది. ఆ రాష్ట్రాలన్నీ ప్రస్తుతం ఎఫ్ఎంఆర్ను వినియోగిస్తున్నాయి.
భారత్ ‘ఏక్ట్ ఈస్ట్’ విధానంలో భాగంగా 2018లో దానిని అమలు పరుస్తున్నారు. మయన్మార్తో సరిహద్దు ఆందోళనల గురించి భారత్ ప్రస్తావించిన నెల తరువాత అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దేశంలోకి మయన్మార్ శరణార్థుల వలసతో సహా సరిహద్దు పొడవునా సవాళ్లు ఎదురవుతున్నాయి.
మూడేళ్లలో నక్సలిజం నిర్మూలన
కాగా, రానున్న మూడు సంవత్సరాలలో దేశం నుంచి నక్సలిజం బెడదను నిర్మూలించనున్నట్లు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. తేజ్పూర్ సమీపంలోని సలోనిబరిలో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బి) 60వ అవతరణ దినోత్సవం సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు (సిఎపిఎఫ్లు) అన్నిటిలోకి ఎస్ఎస్బి సరిహద్దు గ్రామాలలో ‘సంస్కృతి, ప్రాంతాలు, భాషను సమీకృతం చేయడంలో విలక్షణ పాత్ర’ పోషిస్తోందని, ఆ ప్రాంతాల ప్రజలను దేశంలోని తక్కిన ప్రాంతాలకు సన్నిహితంగా తీసుకువస్తున్నదని చెప్పారు.
సరిహద్దులను కాపలా కాయడంతో పాటు ఇతర సిఎపిఎఫ్లతో పాటు ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్లలో నక్సలైట్లకు వ్యతిరేకంగా సమర్థంగా విధులు నిర్వహిస్తున్నదని మంత్రి కొనియాడారు. ‘వచ్చే మూడు సంవత్సరాలలో ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో దేశం నక్సల్ సమస్య నుంచి నూటికి నూరు శాతం విముక్తం అవుతుంది’ అని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.
ఆరుగురు ఎస్ఎస్బి సిబ్బంది విశిష్ట సేవకు గాను అవార్డులను, మూడు బెటాలియన్లకు ట్రోఫీలను బహూకరించడంతో పాటు హోమ్ శాఖ మంత్రి ఈసందర్భంగా ఒక పోస్టేజ్ స్టాంప్ను కూడా విడుదల చేశారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.