టిడీపీ, వైసీపీలలో ఏ పార్టీకి ఓటు వేసినా బీజేపీకే వేసినట్లే అని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను రాష్త్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆదివారం విజయవాడలో పదవీబాధ్యతలు చేబడుతూ వై ఎస్ షర్మిల హెచ్చరించారు. ప్రజలు వైసీపీ, టీడీపీలకు ఎందుకు ఓటు వేయాలని ఆమె ప్రశ్నించారు. బీజేపీకి అమ్ముడు పోవడానికి వైసీపీ, టీడీపీ నుంచి ఎందుకు పోటీ పడుతున్నాయని ఆమె మండిపడ్డారు.
టీడీపీ, వైసీపీకి చెందిన 25 మంది ఎంపీలు ఏం చేస్తున్నారని ఆమె నిలదీశారు. 25 మంది ఎంపీలు బీజేపీ చేతుల్లో ఉన్నారని, బీజేపీ చెబితే గంగిరెద్దులా తల ఊపుతున్నారని ఆమె విమర్శించారు. చంద్రబాబు, జగన్ బీజేపీతో దోస్తీ కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారని ఆమె ఆరోపించారు.
ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు, జగనే కారణం అని వైఎస్ షర్మిల విమర్శించారు. చంద్రబాబు అమరావతి రాజధాని అని 3డీ గ్రాఫిక్స్ చూపించగా, జగన్ మూడు రాజధానులు అన్నారు. ఒకటి కూడా అవ్వలేదని ఆమె విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ 2004లో వైఎస్ఆర్ ప్రారంభించారని, వైఎస్ హయాంలో పోలవరం కుడి, ఎడమ కాల్వల నిర్మాణం పూర్తి చేశారని ఆమె గుర్తుచేశారు. అయితే, ఆయన చనిపోయాక ఈ ప్రాజెక్టు ఒక్క అడుగు ముందుకు వెళ్లలేదని ధ్వజమెత్తారు.
టీడీపీ-వైఎస్ఆర్సీపీ దొందూ దొందేనని షర్మిల దుయ్యబట్టారు. ఏపీలో అభివృద్ధి కనిపించడం లేదని, పదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఆమె ఆరోపించారు. ఏపీపై రూ.10 లక్షల కోట్లకుపైగా అప్పుల భారం ఉందని చెబుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారని విమర్శలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాడిన జగన్ సీఎం అయిన తర్వాత ఒక్కసారైనా ప్రత్యేక హోదా గురించి పోరాడారా?. అని ఆమె ధ్వజమెత్తారు.
రాష్ట్రానికి ఒక్క మెట్రో కూడా తేలేకపోయారు. కనీసం పదేళ్లలో పది పెద్ద పరిశ్రమలైనా రాలేదు. స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను వైఎస్ఆర్సీపీ తాకట్టుపెట్టింది. సమయానికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్రం ఉందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
“మణిపూర్ అల్లర్లు జరుగుతుంటే టీడీపీ – వైఎస్ఆర్సీపీలు బీజేపీకి భయపడి ఒక్కరోజు కూడా నోరు మెదపలేదు.. మనుషులు చచ్చిపోతుంటే నోరువిప్పలేని వాళ్లు మనుషులేనా? గత ఐదేళ్లలో టీడీపీ – వైఎస్ఆర్సీ పార్టీలు బీజేపీ ముందు గంగిరెద్దుల్లా తల ఊపడం తప్పితే రాష్ట్ర హక్కుల కోసం మోదీ ప్రభుత్వాన్ని నీలాదీశారా?” అంటూ ఆమె ప్రశ్నించారు.
ఎక్కడ చూసినా ఇసుక మాఫియా.. మైనింగ్ మాఫియా.. ఎటుచూసినా దోచుకోవడం దాచుకోవడం ఇదీ రాష్ట్రంలో పరిస్థితి అంటూ ఆమె తన అన్న పాలనపై మండిపడ్డారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లకు ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల అక్కడ పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. అదీ ఏపీకి కూడా వచ్చుంటే ఎన్నో పరిశ్రమలు వచ్చి, ప్రజలకు ఉపాధి కలిగేదని ఆమె చెప్పారు. మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా ఎందుకురాదన్న జగన్ రెడ్డి.. స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని ఆమె దుయ్యబట్టారు.