అయోధ్యలోని రామ మందిరంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది . రాముని జన్మస్థలం లో 500 ఏళ్ల తర్వాత అయోధ్య రామయ్య కొలువు తీరారు. అయోధ్య రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన చారిత్రాత్మక ఘట్టం పూర్తయ్యింది. అయోధ్య గర్బాలయంలో బాలరాముడికి ప్రధాని నరేంద్ర మోదీ తొలిపూజ చేసి, దర్శించుకున్నారు.
మోదీతో పండితులు పూజలు చేయించారు. . స్వామివారికి మొదటి హారతి ప్రధాని మోదీ ఇచ్చారు. సరిగ్గా 12.29 గంటలకు ప్రారంభమైన ప్రతిష్ఠ 84 సెకెన్ల పాటు జరిగింది. అభిజిత్ లగ్నంలో ఈ క్రతువు నిర్వహించారు.
ఈ మహా క్రతువు కాశీకి చెందిన ప్రముఖ వేద ఆచార్య గణేశ్వర్ ద్రవిడ్, ఆచార్య లక్ష్మీకాంత దీక్షిత్ ఆధ్వర్యంలోని 121 మంది వేద పండితులు, రుత్విజుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ శుభ సందర్భాన అయోధ్య నగరమంతా రామనామ స్మరణతో మార్మోగిపోయింది.
రామయ్య దర్శన భాగ్యంతో యావత్తూ భారతదేశం పులకించిపోతోంది. బాల రాముడిని చూడడానికి రెండు కళ్లు సరిపోవడంలేదు.
ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణంతో స్వర్ణాభరణాలు ధరించి చిరు దరహాసం, ప్రసన్నవదనంతో ఉన్న రామచంద్రుడిని చూసి భక్త జనం పులకించిపోతోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన కళ ఎట్టకేలకు నెరవేరడంతో కోట్లాది మంది రామ భక్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
గర్భగుడిలో జరిగిన ఈ పూజా క్రతువులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన వెంటనే రామజన్మభూమిపై హెలికాప్టర్లతో పూలను చల్లారు. మరోవైపు, రాముడి ప్రాణ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని దేశ ప్రజలంతా టీవీల ద్వారా వీక్షించారు. ఒక అద్భుతమైన, అపూర్వమైన ఘట్టాన్ని వీక్షించిన ప్రజలంతా ఒక అనీర్వచనీయమైన అనుభూతికి లోనయ్యారు. ఈరోజు యావత్ దేశ రామ నామ స్మరణతో మారుమోగింది.
ఈ కార్యక్రమంలో విగ్రహ ప్రతిష్టాపన లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని తెలియజేశారు. అయోధ్యలోని రామ మందిరంలోకి ఆయన వెళుతున్న వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఆయన గుడి లోపలికి మెల్లగా నడుస్తూ రామునికి నైవేద్యాలను తీసుకువెళ్ళిన వీడియోను పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా ఈ దైవిక కార్యక్రమంలో భాగమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు.అయోధ్య శ్రీరామ మందిరంలో శ్రీ రామ్ లల్లా జీవితానికి అంకితం చేయబడిన అతీంద్రియ క్షణం ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ దివ్య కార్యక్రమంలో భాగస్వామ్యమైనందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ జై శ్రీరామ్ అంటూ పోస్ట్ చేశారు. మాటల్లో చెప్పలేనంత సంతోషం ఈరోజు కలిగిందని ఆయన తన పోస్టు ద్వారా పేర్కొన్నారు.