వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బలమైన బీజేపీని ఎదుర్కొడానికి ‘ఇండియా’ పేరుతో ఏర్పడిన ప్రతిపక్ష కూటమిలో పశ్చిమ్ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటనలు కలకలం రేపుతున్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బెంగాల్లో ఒంటిరిగానే పోటీ చేస్తామని ఆమె ప్రకటించడం ప్రకంపనలు రేపుతోంది. సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని, ఫలితాల తర్వాతే పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామని మమతా బెనర్జీ వెల్లడించారు.
“నేను వారికి (కాంగ్రెస్కి) చాలా ప్రతిపాదనలు ఇచ్చాను… కానీ వారు వాటిని తిరస్కరించారు. దేశంలో మిగతా చోట్ల ఏమి జరుగుతుందనే దాని గురించి నాకు ఆందోళన లేదు… కానీ మాది సెక్యులర్ పార్టీ.. బెంగాల్లో మేము ఒంటరిగా బీజేపీని ఓడిస్తాం. ఎన్నికల తర్వాత అఖిల భారత స్థాయిలో నిర్ణయం తీసుకుంటాం” అని మమత స్పష్టం చేశారు.
బెంగాల్లోని మొత్తం 42 పార్లమెంట్ స్థానాలకుగానూ రెండింటిని మాత్రమే కాంగ్రెస్కు ఇవ్వడానికి టీఎంసీ ప్రతిపాదించినట్టు సమాచారం. కానీ, కాంగ్రెస్ మాత్రం 10 నుంచి 12 సీట్లు డిమాండ్ చేసిందని తెలిసింది. దీనికి బెంగాల్ సీఎం అంగీకరించని నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌధరి ఆమెపై విమర్శలు గుప్పించారు.
ఆమె అవకాశవాదని, సొంత బలంతో పోటీ చేయడం ఎలాగో కాంగ్రెస్కు తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాల మధ్యే బెంగాల్ సీఎం తాజా ప్రకటన చేయడం గమనార్హం. 2014 లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో కాంగ్రెస్ 4 స్థానాలు గెలుచుకోగా, గత ఎన్నికల్లో రెండుకు పడిపోయింది. ఇది కూడా ఆ పార్టీతో పొత్తుకు టీఎంసీ అనాసక్తికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ క్రమంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతోన్న భారత్ జోడో న్యాయ యాత్ర గురువారం బెంగాల్లోకి ప్రవేశించనున్న వేళ మమత విమర్శలు గుప్పించారు.‘వారు మా రాష్ట్రానికి వస్తున్నారు.. మేము ఇండియా కూటమిలో భాగమైనప్పటికీ దాని గురించి నాకు సమాచారం ఇవ్వాలన్న మర్యాద వారికి లేదు.. కాబట్టి బెంగాల్కు సంబంధించినంత వరకూ ఎలాంటి సంబంధాలు లేదు’ అని ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. మమతా బెనర్జీ లేకుండా కూటమిని ఊహించలేమని ఆ పార్టీ స్పష్టం చేసింది. దీదీతో పొత్తు చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొంది. రాహుల్ గాంధీ సైతం మమతా బెనర్జీ తనకు అత్యంత సన్నిహితురాలని లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో టీఎంసీతో కలిసి పోటీ చేస్తామని, ఈ దిశగా పొత్తు చర్చలు సాగుతున్నాయని అన్నారు.
”మమతా బెనర్జీ ఇచ్చిన మొత్తం ప్రకటనను మీరు వినిలేదనుకుంటా. బీజేపీని ఓడించాలని తాము కోరుకుంటున్నామని, బీజేపీని ఓడించేందుకు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయమనేది ఆమె మాటల సారాంశం. అదే ఫీలింగ్తో మేము పశ్చిమబెంగాల్లో అడుగుపెడుతున్నాం. దూరప్రయాణం అయినప్పుడు మార్గంలో స్పీడ్బ్రేకర్లు, రెడ్ లైట్ వంటివి వస్తాయి. దాని అర్ధం ప్రయాణం ఆపినట్టు కాదు. ప్రయాణం కొనసాగుతుంది. స్పీడ్ బ్రేకర్లను అధిగమిస్తాం, రెడ్ లైట్లు గ్రీన్లైట్లుగా మారుతాయి” అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ తెలిపారు.