లోక్సభ ఎన్నికల ముందు ఇండియా కూటమికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎన్నికల్లో కూటమితో కలిసి పనిచేసేందుకు పలు పార్టీలు వెనకడుగేస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నామని పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది.
పంజాబ్లో కాంగ్రెస్కు గెలిచే సత్తా లేదని.. 13 స్థానాల్లో ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ స్పష్టం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇండియా కూటమికి షాకిచ్చారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నుంచి ఒంటరిగా పోటీ చేస్తామని వెల్లడించారు.
ఇండియా కూటమితో పొత్తు ఉండదని, సీట్ల పంపకాల విషయమై కాంగ్రెస్ తో జరిపిన చర్చలు విఫలమయ్యాయని ఆమె చెప్పారు. బెంగాల్ లో ఒంటరిగానే పోటీ చేసి, బిజెపిని మట్టి కరిపిస్తామని స్పష్టం చేశారు. ఆమె ప్రకటించిన కొన్ని గంటలకే పంజాబ్ ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ తో పొత్తు లేకుండా అన్ని సీట్లకు పోటీ చేస్తామని ప్రకటించారు.
ఇలా ఉండగా, సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోరాడాలని ఆప్ పంజాబ్ యూనిట్ చేసిన ప్రతిపాదనకు పార్టీ జాతీయ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం ఆమోదం సంబంధిత వర్గాలు తెలిపాయి. పంజాబ్ విషయంలో ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ హైకమాండ్ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని, ఈ క్రమంలోనే భగవంత్ మాన్ ప్రకటన చేసినట్లు తెలుస్తున్నది. మరోవంక, పంజాబ్లో పొత్తులపై పంజాబ్ కాంగ్రెస్ సైతం పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తున్నది.