అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి రెండంకెల సీట్లను గెలుచుకోవాలని పట్టుదలతో బిజెపి పనిచేస్తున్నది. 2019 ఎన్నికల్లో ఏకంగా నాలుగు ఎంపీలను గెలుచుకుని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సవాల్ విసిరింది. ఆ తర్వాత క్రమంగా పుంజుకుంటూ వచ్చింది బీజేపీ. అయితే మరోసారి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లలో పాగా వేయాలని చూస్తోంది.
ఇందులో భాగంగా ఆ పార్టీ అగ్రనేత అమిత్ షా ఆదివారం తెలంగాణలో మూడు జిల్లాల్లో తలపెట్టిన కీలక సమావేశాల్లో పాల్గొంటారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్కటైన తెలంగాణ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది బీజేపీ. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకొని, అక్కడ్నుంచి నేరుగా మహబూబ్నగర్ వెళ్లి, జిల్లా కేంద్రంలో నిర్వహించే పార్టీ క్లస్టర్ సమావేశానికి హాజరవుతారు.
లోక్ సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. ఆ తర్వాత కరీంనగర్కు వెళ్లి కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత హైదరాబాద్కు చేరుకుని సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో పార్టీ నిర్వహించే మేధావుల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఈ సమావేశంలో పార్టీ మేనిఫెస్టో రూపకల్పనపై చర్చించనున్నారు. రాత్రికి తిరిగి ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు.
తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావించిన బీజేపీ పార్ 8 సీట్లతో సరిపెట్టుకుంది. 2018 ఎన్నికల్లో కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలుచుకోగా ఈసారి ఆ సంఖ్య పెరిగింది. ఓటింగ్ శాతం కూడా భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది.
మోదీ మ్యానియాతో పాటు పలు కీలక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లబోతుంది. 2019లో నాలుగు ఎంపీలను గెలిచి సంచలన విజయాలను నమోదు చేసిన బీజేపీ ఈసారి కూడా ఎక్కువ సీట్లను గెలవాలని గట్టి పట్టుదలతో ఉంది. కీలక నేతలను లోక్ సభ బరిలో ఉంచేలా పార్టీ హైకమాండ్ కూడా కసరత్తు చేస్తోంది. త్వరలోనే అభ్యర్థుల ఎంపికపై కూడా స్పష్టత ఇవ్వాలని భావిస్తోంది.