లోక్సభలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ అభివృద్ధి చెందుతున్న భారత్ కు చిహ్నం అని బిజెపి ఓబిసి మోర్చా అధ్యక్షుడు, ఎంపీ డా. కె లక్ష్మణ్ కొనియాడారు. నేటి యువతరం ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఉంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించేందుకు ఈ బడ్జెట్ ఓ గ్యారెంటీగా నిలుస్తుందని హర్షం ప్రకటించారు.
పేదలు, యువత, అన్నదాత, మహిళల సంక్షేమానికి, వారి మేలు కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, అన్ని రంగాలకు విశ్వసనీయతను కల్పించేదిలా బడ్జెట్ ఉందని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రధాని నరేంద్ర మోదీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
4 కోట్ల మంది రైతులకు బీమా సౌకర్యం కల్పిస్తూ, సమ్మిళిత అభివృద్ధి గ్రామస్థాయికి చేర్చేలా, క్రీడాకారులకు ఆత్మస్థైర్యం పెంచేలా, యువతకు పెద్దపీట వేసేలా నరేంద్ర మోదీ ప్రభుత్వం ముందడుగు వేస్తోందని హర్షం ప్రకటించారు. సాంకేతికత రంగంలో పరిశోధన, సృజనాత్మకత కోసం రూ.లక్ష కోట్ల నిధి ఏర్పాటు చేయడం గొప్ప పరివర్తనకు నిలువుటద్దం అని తెలిపారు.
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి ఆశాజనకమైన నిధులు కేటాయించి మరోసారి తెలంగాణ రాష్ట్రానికి చిత్తశుద్ధిని చాటడం పట్ల హర్షం ప్రకటించారు. భారతీయ రైల్వేల మరింత అభివృద్ధి కోసం రూ. 2.4 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించారని చెప్పారు. ప్రస్తుత బడ్జెట్ లో రైల్వేకు సంబంధించి తెలంగాణకు రూ. 5071 కోట్లు కేటాయించడం గొప్ప విషయం అని తెలిపారు.
దేశంలో రైలు కనెక్టివిటీని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లలో అనేక చర్యలు తీసుకుందని చెబుతూ మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చివరి బడ్జెట్లో రైల్వేశాఖకు అద్భుతమైన బహుమతి లభించిందని తెలిపారు. ప్రయాణికుల భద్రత, సౌలభ్యం మేరకు 40 వేల రైల్వే బోగీలను వందేభారత్ ప్రమాణాలకు అనుగుణంగా మార్చేందుకు దోహదం కానుందని చెప్పారు.
కేంద్ర బడ్జెట్ లో మహిళా సాధికారతపై దృష్టి సారించేలా ప్రవేశపెట్టిన ‘లక్పతి దీదీ’ పథకంలో లబ్ధిదారుల సంఖ్యను 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచాలని నిర్ణయించడం పట్ల అభినందనలు తెలిపారు. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చే ఐదేళ్లలో గ్రామీణ పేదలకు మరో 2 కోట్ల ఇళ్ల నిర్మించేందుకు నిర్ణయించి మరోసారి నరేంద్ర మోదీ పేదల దూతగా నిలిచారని తెలిపారు.
కేంద్ర బడ్జెట్లో వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖకు రూ.1.27 లక్షల కోట్లు కేటాయించి మరింత భరోసా కల్పించారని చెప్పారు. వ్యవసాయ రంగంలో మరింత వృద్ధి కోసం పబ్లిక్, ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు.
అయితే ఎన్నికల సంవత్సరం సందర్భంగా గత ప్రభుత్వాలు ఊహల పల్లకీలో మోసే బడ్జెట్ గా కాకుండా.. భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం, వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ ను రూపకల్పన చేయడం నరేంద్ర మోదీ ప్రభుత్వం దూరదృష్టి, దేశ ప్రజల పట్ల సంక్షేమంపై ఉన్న సంకల్పానికి నిదర్శనం అని తెలిపారు.