మాజీ ఉప ప్రధాని, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా స్వయంగా ప్రకటిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అద్వానీకి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలో ఈ పురస్కారం వరించడంపై ఎల్కే అద్వానీ తాజాగా స్పందించారు. ఎంతో వినయపూర్వకంగా ఈ అవార్డుని స్వీకరిస్తున్నానని వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇది తనకే కాకుండా తన సిద్ధాంతాలకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపారు. తన జీవితం దేశం కోసమే అని ఎప్పుడో నిర్ణయించుకున్నానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
‘ఎంతో వినయంగా, కృతజ్ఞతతో ఈ భారతరత్న పురస్కారాన్ని అంగీకరిస్తున్నాను. ఇది కేవలం నాకు మాత్రమే కాదు. నేను ఎన్నో ఏళ్లుగా నమ్ముకున్న సిద్ధాంతాలకు, విలువలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను’ అని సంతోషంగా చెప్పారు. ఈ సందర్భంగా అద్వానీ తన భార్య కమలను గుర్తు చేసుకున్నారు.
వ్యక్తిగత, రాజకీయ జీవితంలో తన వెన్నంటే ఉంటూ ఎంతో సపోర్ట్గా నిలిచిందని చెప్పుకొచ్చారు. తనకు ఇంతటి అత్యున్నత పురస్కారం ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
‘14 ఏళ్లకే నేను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో చేరాను. అప్పుడే నిర్ణయించుకున్నాను నేనే పని చేసినా అది దేశం కోసమే అని. ఈ జీవితం నాకోసం కాదు.. దేశం కోసం అన్న సిద్ధాంతాన్నే బలంగా నమ్మాను. దేశం కోసం అంకితభావంతో, నిస్వార్థంతో పని చేశాను’ అని తెలిపారు.
ఈ సందర్భంగా సుదీర్ఘకాలం తాను కలిసి పనిచేసిన పండిట్ దీన్దయాల్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్పేయీలను మనసారా స్మరించుకున్నారు. లక్షలాది పార్టీ కార్యకర్తలు, స్వయంసేవకులతో పాటు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. “మా కుటుంబ సభ్యులు నాకు అన్ని విధాలా అండగా ఉన్నారు. వాళ్లే నా బలం. ఈ పురస్కారం అందించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి నా కృతజ్ఞతలు” అని అద్వానీ తన ప్రకటనలో పేర్కొన్నారు.