దాదాపు పది రోజులుగా కొనసాగుతున్న ఝార్ఖండ్ సంక్షోభానికి తెరపడింది. ముఖ్యమంత్రి చంపై సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం-కాంగ్రెస్ సర్కారు బలపరీక్షలో నెగ్గింది. సోమవారం జరిగిన ఓటింగ్లో చంపై సర్కారుకు అనుకూలంగా 47 ఓట్లు.. వ్యతిరేకంగా 29 ఓట్లు వచ్చాయి. దీంతో హేమంత్ సోరేన్ రాజీనామాతో ఏర్పడిన సంక్షోభం ముగిసిపోయింది.
మనీ ల్యాండరింగ్ కేసులో జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో జేఎంఎం సీనియర్ నేత చంపై సోరెన్ ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మొత్తం 81 స్థానాలున్న ఝార్ఖండ్ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 41.
ఝార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, రాష్ట్రీయ్ జనతా దళ్తో కలిపి 47 మంది సభ్యుల మద్దతు చంపై సోరెన్కు ఉంది. మెజార్టీ మార్క్కు ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు. బలపరీక్షలో వీరంతా ఓటింగ్లో పాల్గొని ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను విపక్ష బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తుందని హైదరాబాద్ తరలించారు.
రెండు రోజుల అనంతరం ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరిని 37 మంది ఎమ్మెల్యేలు రాంచీకి చేరుకున్నారు. మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టైన మాజీ సీఎం హేమంత్ సోరెన్ విశ్వాస పరీక్షలో ఓటు వేసేందుకు పీఎంఎల్ఏ కోర్టు అనుమతించింది. అసెంబ్లీలో సభ్యుడిగా ఓటు వేసే హక్కు ఆయనకు ఉందని స్పష్టం చేసింది. దీంతో హేమంత్ సోరెన్ ఈ రోజు ఓటింగ్లో పాల్గొన్నారు.
అసెంబ్లీలో విశ్వాస తీర్మానంపై చర్చను ముఖ్యమంత్రి ప్రారంభిస్తూ, దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ”కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రబుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. 2019లో హేమంత్ సోరెన్కు ప్రజాతీర్పు లభించింది. అలాంటి ముఖ్యమంత్రిని భూకుంభకోణం కేసులో అరెస్టు చేశారు” అని చంపయి సోరెన్ ఆవేదన వ్యక్తం చేశారు.
జార్ఖాండ్ చరిత్రలో గిరిజనులు ఎప్పుడు తమ సామర్థ్యాన్ని పెంచుకోవాలని చూసినా ఆ నాయకత్వాన్ని అణిచివేసే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని ఆయన మండిపడ్డారు. హేమంత్ సోరెన్ విషయంలో ఎలాంటి అన్యాయం జరిగిందో ఈరోజు యావద్దేశ ప్రజలు చూశారని, మీరు ఏ గ్రామానికి వెళ్లి చూసినా ప్రతి ఇంట్లోనూ హేమంత్ సోరెన్ ప్రవేశపెట్టిన పథకాలు కనిపిస్తాయని సీఎం చెప్పారు.
హేమంత్ సోరెన్ మాట్లాడుతూ గత జనవరి 31న రాత్రి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనను అరెస్ట్ చేశారని, అది ఒకటి చీకటి అధ్యాయమని విమర్శించారు. ఒక సీఎం అరెస్ట్ కావడం దేశంలో ఇదే తొలిసారని, తన అరెస్ట్ వెనుక రాజ్భవన్ ప్రమేయం ఉన్నదని గట్టిగా నమ్ముతున్నానని చెప్పారు. తాను నేరం చేసినట్లు రుజువైతే రాజకీయాల్లోంచి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు.
దీనికి ముందు, అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్ సీపీ రాథాకృష్ణన్ ప్రసంగిస్తుండగా, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ”హేమంత్ సోరెన్ జిందాబాద్” అంటూ నినాదాలు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల ప్రవర్తనపై గవర్నర్ సభ వెలుపల మాట్లాడుతూ, గవర్నర్ ప్రసంగాన్ని అధికార పార్టీనే సిద్ధం చేసిందని, ఇప్పుడు వారే నినాదాలు చేస్తున్నారని ఆక్షేపించారు.