భారతదేశ మాజీ ప్రధానులు పీవీ.నరసింహారావు, చౌదరి చరణ్సింగ్లతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్లకు భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
భారతదేశ ఐదో ప్రధానిగా పనిచేసిన దివంగత చౌదరి చరణ్ సింగ్ రైతుల సంక్షేమం కోసం చేసిన అచంచలమైన అంకితభావానికి మరణానంతరం భారతరత్నతో సత్కరించుకున్నామని తెలిపారు.
ఇప్పటికే బీజేపీ దిగ్గజ నేత ఎల్ కే అద్వానీ, బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్లకు ఈ ఏడాది భారతరత్నను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది భారతరత్న అవార్డులను ప్రకటించిన ఐదుగురిలో నలుగురికి మరణానంతరం అవార్డు వరించింది. ప్రస్తుతం అవార్డుకు ఎంపికైన వారిలో ఎల్ కే అద్వాణీ మాత్రమే జీవించి ఉన్నారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, భారత హోం మంత్రిగా పని చేసిన చరణ్ సింగ్ రైతుల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా చేసిన ప్రతిఘటన, ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధత దేశానికి స్ఫూర్తినిచ్చేవిగా నిలిచాయి. దేశానికి ఆయన చేసిన సాటిలేని సేవలను గౌరవించడం ప్రభుత్వానికి దక్కిన అదృష్టం అని ప్రధాని మోదీ కొనియాడారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావును భారతరత్నతో సత్కరించడం ఆనందంగా ఉంది. ప్రముఖ పండితుడు, రాజకీయవేత్త అయిన నరసింహారావు వివిధ హోదాలలో విస్తృత సేవలు అందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, పార్లమెంటు, అసెంబ్లీ సభ్యునిగా ఎన్నో ఏళ్లుగా ఆయన విశేష కృషి చేశారు. భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో, దేశ శ్రేయస్సు, అభివృద్ధికి బలమైన పునాది వేయడంలో దూరదృష్టి గల నాయకత్వం కీలక పాత్ర పోషించింది. నరసింహారావు ప్రధానిగా పనిచేసిన కాలం ఆర్థికాభివృద్ధిలో కొత్త శకానికి నాంది పలికిందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ప్రధానమంత్రిగా పీవీ పదవీకాలంలో ప్రపంచ మార్కెట్లకు భారత్ ద్వారాలు తెరిచింది. ఇది ఆర్థిక అభివృద్ధి కొత్త శకాన్ని ప్రోత్సహించింది. ఇంకా, భారత విదేశాంగ విధానం, భాష, విద్యా రంగాలకు ఆయన అందించిన సహకారం క్లిష్టమైన పరివర్తనల ద్వారా నడిపించడమే కాకుండా సాంస్కృతిక, మేధో వారసత్వాన్ని సుసంపన్నం చేసిన నాయకుడిగా అతని బహుముఖ వారసత్వాన్ని నొక్కి చెబుతుంది.
చౌధరి చరణ్ సింగ్ స్వాతంత్య్ర భారత ఐదో ప్రధాని మంత్రిగా పనిచేశారు. ఆయన రైతు బాంధవుడిగా పేరు గడించారు. 1979 జులై 28 నుంచి 1980 జులై 14 వరకూ దాదాపు ఏడాది పాటు ప్రధానిగా సేవలందించారు. యూపీలో మొదటి కాంగ్రెస్సేతర ముఖ్యమంత్రి చౌదరి చరణ్ సింగ్.. వ్యవసాయ రంగంలో ముఖ్యంగా రైతులకు మేలు చేసే ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు.
కేంద్రంలో జనతా పార్టీ తరఫున మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఉప ప్రధానిగా ఉన్నారు. ఆయన రాజీనామా తర్వాత కాంగ్రెస్ మద్దతుతో ప్రధాని అయ్యారు. కానీ, ప్రధాని హోదాలో ఒక్క రోజు కూడా పార్లమెంట్కు వెళ్లకుండానే పదవి నుంచి దిగిపోయారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు రోజు కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించకోవడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది.
భారతదేశ హరిత విప్లవ పితామహుడిగా మన్ననలు అందుకున్న వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్.. వ్యవసాయ రంగంలో చేసి విశేష సేవలకు కేంద్రం భారతరత్న అవార్డును ప్రకటించింది. వ్యవసాయం, రైతుల సంక్షేమంలో దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఎంఎస్ స్వామినాథన్కు భారతరత్న ప్రకటించింది. సవాళ్ల సమయంలో భారతదేశం వ్యవసాయంలో స్వావలంబన సాధించడంలో కీలక పాత్ర పోషించారు.
భారతీయ వ్యవసాయాన్ని ఆధునీకరించే దిశగా అద్భుతమైన ప్రయత్నాలు చేశారు. స్వామినాథన్ దార్శనిక నాయకత్వం భారతీయ వ్యవసాయాన్ని మార్చడమే కాకుండా దేశ ఆహార భద్రత, శ్రేయస్సుకు హామీ ఇచ్చింది.