కేంద్రం దివంగత చౌదరి చరణ్ సింగ్ కు భారత రత్న అవార్డు ప్రకటించగానే యూపీలో ఉన్న ఆయన మనవడు జయంత్ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ ప్రస్తుతం ఉన్న ఇండియా కూటమికి గుడ్ బై చెప్పేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయ కూటమిలో చేరేందుకు సిద్ధమైపోయింది.
ఇప్పటికే ప్రతీ ఎన్నికల సమయంలో కూటముల్ని, మిత్రపక్షాల్ని మార్చేసే అలవాటు ఉన్న ఆర్ఎల్డీ మరోసారి ఎన్డీయే పంచన చేరబోతోంది. చరణ్ సింగ్ కు భారత రత్న ప్రకటిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ లో చేసిన పోస్టును సమాధానంగా ఆఫర్ ను ఎలా తిరస్కరించగలనంటూ ఆర్ఎల్డీ అధ్యక్షుడు జయంత్ చౌదరి పెట్టిన పోస్టు ఏం జరగబోతోందో చెప్పకనే చెప్పేసింది.
ప్రధాని మోదీ చరణ్ సింగ్ కు భారత రత్న ప్రకటిస్తూ తనను అభినందిస్తూ పోస్టు పెట్టినప్పుడు సీట్లు, ఓట్ల గురించి మాట్లాడటం దాని విలువను తగ్గించినట్లవుతుందని జయంత్ తెలిపారు. ప్రధానమంత్రి మోదీ దేశపు ప్రాథమిక మనోభావాలు, స్వభావాన్ని అర్థం చేసుకున్నారని రుజువు చేసే నిర్ణయం తీసుకున్నారని జయంత్ హర్షం ప్రకటించారు.
మాజీ ప్రధాని, రైతు నేతగా పేరున్న చౌదరి చరణ్ సింగ్ కు భారత రత్న అవార్డు ప్రకటించడం ద్వారా పశ్చిమ ఉత్తర ప్రదేశ్ తో పాటు చుట్టుపక్కన రాష్ట్రాల రైతుల్లో ఆయనకు ఉన్న పేరు బిజెపికి వచ్చే ఎన్నికలలో ఉపయోగపడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. యుపిలో అన్ని సీట్లను గెలుచుకోవాలనే వ్యూహం ఫలించేందుకు దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు.