వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీతో పాటు అనుబంధ విభాగాలకు చెందిన బ్యాంకు ఖాతాలను ఆదాయపు పన్ను శాఖ స్తంభింపజేసింది. ఈ మేరకు కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ వెల్లడించారు.
పార్టీ ఇచ్చిన చెక్కులను గౌరవించేందుకు బ్యాంకులు నిరాకరిస్తున్నట్లు ఫిబ్రవరి 15న సమాచారం అందందని, అనంతరం యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాలను సీజ్ చేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్, ఆ పార్టీ అనుబంధ విభాగం నుంచి రూ.210 కోట్లు రికవరీ చేయాలని ఆదాయపు పన్ను శాఖ కోరింది.
‘మా ఖాతాల్లోని క్రౌడ్ ఫండింగ్ నగదు స్తంభింపజేశారు… ఎన్నికల నోటిఫికేషన్కు కేవలం రెండు వారాల ముందు ప్రతిపక్షాల ఖాతాలు స్తంభింపచేయడం ప్రజాస్వామ్యాన్ని స్తంభింపజేయడంతో సమానం’ అని కాంగ్రెస్ ఆరోపించింది. ఆదాయపు పన్ను శాఖ కాంగ్రెస్ నాలుగు ప్రధాన బ్యాంకు ఖాతాలను పలు కారణాలతో స్తంభింపజేసిందని ఆ పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ పేర్కొన్నారు. ఇది పార్టీ రాజకీయ కార్యకలాపాలన్నింటినీ ప్రభావితం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు.
‘దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఖాతాలను సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు కేవలం రెండు వారాల ముందు అధికారులు పేలవమైన కారణాలతో స్తంభింపజేశారు’ అని మాకెన్ మండిపడ్డారు. మా ఖాతాలను స్తంభింపజేసిన విషయం గురువారమే మేము గుర్తించామని తెలిపారు. మా పార్టీ జారీచేసిన చెక్కులను బ్యాంకులు పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. యూత్ కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలతో పాటు పార్టీ ఖాతాలను కూడా సీజ్ చేశారని పేర్కొన్నారు.
‘ఎన్నికల వేళ మా పార్టీ అకౌంట్లను సీజ్ చేయడం ప్రజాస్వామ్య ప్రక్రియకు విరుద్ధం. మా అకౌంట్లను ఫ్రీజ్ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో దెబ్బ కొట్టేందుకే ఇలా చేశారు’ అని అజయ్ మాకెన్ ఆరోపించారు. దీనిపై కోర్టుకు వెళ్లేందుకు ఆలోచిస్తున్నామని చెప్పారు.
ఆదాయ పన్ను శాఖకు కాంగ్రెస్ రూ. 210 కోట్ల జరిమానా చెల్లించవలసి ఉంది. ఈ మొత్తాన్ని రాబట్టేందుకు ఆదాయపన్ను శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకే బ్యాంకులు కాంగ్రెస్ పార్టీ ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు తెలుస్తోంది.