తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకునేందుకు 6 ఇనుప పెట్టెలతో రావాలని తమిళనాడు ప్రభుత్వాన్ని బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. బంగారు ఆభరణాలను తీసుకెళ్లేందుకు తమిళనాడు ప్రభుత్వం కర్ణాటకకు రూ.5 కోట్లు చెల్లించింది. జయలలిత బంగారు నగలు తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించనుంది.
జయలలిత అక్రమంగా సంపాదించిన బంగారు ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించేందుకు బెంగళూరు సిటీ సివిల్ సెషన్స్ కోర్టు తేదీని నిర్ణయించింది. జయలలిత బంగారు ఆభరణాల తమిళనాడుకు అప్పగించే సందర్భంగా స్థానిక పోలీసుల ద్వారా సివిల్ కోర్టులో రెండు రోజుల పాటు అవసరమైన భద్రత ఉండేలా కోర్టు రిజిస్ట్రార్ చర్యలు తీసుకోవాలని బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇదే ఏడాది మార్చి 6వ తేదీ విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. ఆర్టీఐ కార్యకర్త టి. నరసింహమూర్తి దాఖలు చేసిన అప్పీల్ను విచారించిన బెంగళూరు నగరంలోని 36వ సిటీ సివిల్, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. వాదనలు విన్న కోర్టు 2024 మార్చి 6వ తేదీ, 7 తేదీలో జయలలిత బంగారు నగలు తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించింది.
ఆ రెండు రోజుల్లో ఇతర కేసులను విచారించకూడదని కోర్టు నిర్ణయించింది. అమ్మ జయలలిత బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడానికి ఓ వ్యక్తిని నియమించారు. తమిళనాడు ప్రభుత్వ హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, తమిళనాడు ఐజీపీ ఆ వ్యక్తి వెంట ఉండాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ సందర్భంలో ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, ఆరు పెద్ద పెట్టెలతో అవసరమైన భద్రతతో వచ్చి జయలలిత బంగారు ఆభరణాలను తీసుకు వెళ్లాలని తమిళనాడు ప్రభుత్వానికి బెంగళూరులోని ప్రత్యేక కోర్టు సూచించింది. ఈ విషయాన్ని తమిళనాడు డీఎస్పీ, తమిళనాడు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లాలని న్యాయమూర్తి ఆదేశించారు.కర్ణాటక ప్రభుత్వానికి రూ 5 కోట్ల డీడీని తమిళనాడు ప్రభుత్వం ఇచ్చింది. తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన ఐదు కోట్ల డీడీ కర్ణాటక ప్రభుత్వం ఖాతాలోకి వచ్చే ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని న్యాయవాది తెలిపారు. జయలలిత నుంచి 7 కేజీల 40 గ్రాములు బరువున్న 468 రకాల బంగారు నగలు, వజ్రాభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
700 కేజీల వెండి వస్తువులు, 740 ఖరీదైన చెప్పులు, 11, 344 పట్టు చీరలు, 250 శాలువాలు, 12 రిఫ్రిజిరేటర్లు, 10 టివీలు, 8 వీసీఆర్లు, 1 వీడియో కెమెరా, 4 సీడీ ప్లేయర్లు, 2 ఆడియో డెక్స్, 24 టూ ఇన్ వన్ టేప్ రికార్డర్లు, 1, 040 వీడియో క్యాసెట్లు, 3 ఐరన్ లాకర్లు, 1, 93, 202 రూ. నగదుతోపాటు పలు వస్తువులను గతంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జయలలిత అక్రమాస్తులు సంపాధించారని కేసు నమోదు కావడంతో ఈ వస్తువులు అన్ని అప్పట్లో అధికారులు సీజ్ చేశారు.