పంట ఉత్పత్తులకు మద్ద తు ధర కోరుతూ మలిదశ ఉద్యమం ప్రారంభించిన రైతులు పోలీసులతో జరిగిన ఘర్షణలో తొలిసారిగా ఓ సహచరుడిని కోల్పోయారు. హర్యానా సరిహద్దులలో కనౌరీ వద్ద హర్యానా భద్రతాబలగాలకు రైతులకు జరిగిన ఘర్షణలో ఓ 21ఏళ్ల రైతు శుభ్కరణ్ సింగ్ మృతి చెం దాడు. ఈ ప్రాంతంలోనే పరిస్థితి పూర్తిగా చేయిదాటి రణరంగాన్ని తలపించింది.
పంజాబ్ నుంచి త తరలివచ్చిన రైతులను హర్యానా సరిహద్దుల్లోని శంభు, కనౌరీ వద్ద పోలీసులు, భద్రతా బలగాలు అటకాయించారు. దీనిని రైతులు ప్రతిఘటించారు. ముందుకు సాగేందుకు యత్నించారు. దీనితో వీరిని చెదరగొట్టేందుకు హర్యానా పోలీసులు వారిపై భాష్పవాయువు ప్రయోగించారు.
పలు భద్రతా వలయాలను ఛేదించుకుంటూ, బారికేడ్లను తీసివేస్తూ రైతులు ముందుకు సాగడంతో అంబాలా సమీపంలోని శంభు సరిహద్దు రణరంగం అయింది. వీరిని నిలువరించేందుకు మధ్యాహ్యానికి మూడు సార్లు భాష్పవాయువు ప్రయోగించారు. ఇక్కడనే టియర్గ్యాస్ ప్రయోగానికి డ్రోన్లను కూడా వాడారు.
దీనితో రైతులు భాష్పవాయువు నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీయాల్సి వచ్చింది. కనౌరిలో కూడా పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. రైతులను చెదరగొట్టారు. ఈ ప్రాంతం పూర్తిగా ఉద్రిక్తంగా మారింది. ముందుకు వెళ్లుతున్న రైతులు, అక్కడి హర్యానా పోలీసు, భద్రతా బలగాల నడుమ దాదాపుగా సంకుల సమరం జరిగింది.
ఘర్షణల నడుమ తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు రైతులలో ఒక్క రైతు శుభ్కరణ్సింగ్ అప్పటికే చనిపోయి ఉన్నాడని పాటియాలలోని రాజీందర్ర ఆసుపత్రి ఉన్నతాధికారి హెచ్ఎస్ రేఖీ విలేకరులకు తెలిపారు. కనౌరీ సరిహద్దుల నుంచి గాయపడ్డ వారిని ఈ ఆసుపత్రికి తరలించారు. తమ వద్దకు తీసుకువచ్చిన రైతులలో శుభ్కరణ్ సింగ్ తలకు గాయం అయి ఉందని రేఖీ వివరించారు.
ప్రభుత్వంతో జరిపిన చర్చలు నాలుగో విడత కూడా విఫలం అయ్యాయి. దీనితో రెండు రోజుల విరామం తరువాత వేలాది మంది రైతులు ముందుకు కదిలారు. పంటలకు కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత, పంటరుణ మాఫీల ప్రకటన రైతుల ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి.
కాగా, రైతులు శాంతియుతంగా ఉండాలని, సమస్యలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవల్సి ఉంటుందని కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా పిలుపు నిచ్చారు. రైతుల ప్రతినిధులతో చర్చలకు దిగిన త్రిసభ్య మంత్రుల బృందంలో ముండా కీలక పాత్ర వహించారు. అన్ని విషయాలను చర్చించుకోవచ్చునని, ఐదో దఫా చర్చలకు రావాలని పిలుపు నిచ్చారు.