ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో అధికార వైసిపిని ఓడించేందుకు ఒక వంక టిడిపి, జనసేన, బీజేపీ బలమైన కూటమిగా ఏర్పడేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉండగా, మరోవంక ఎపిసిసి అధ్యక్ష పదవి చేపట్టిన వైఎస్ షర్మిల నోటాకు మించి ఓట్లు లేని కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఉనికి కోసం వామపక్షాలతో జత కట్టేందుకు సిద్ధపడుతున్నట్లు కనిపిస్తున్నది.
టిడిపి, జనసేన కూటమితో పొత్తుకోసం మొన్నటి వరకు ప్రయత్నం చేసిన వామపక్షాలు, ఇప్పుడు ఆ కూటమిలో బీజేపీని చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉండడంతో తమ రాజకీయ మనుగడకోసం అంతర్మధనంలో పడ్డారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన రెండు ఎన్నికలలో కూడా ఏపీలో ఒక్క సీటు కూడా గెలుపొందలేని వామపక్షాలు ఇప్పుడు సొంతంగా నిలబడి బలమైన పోటీ ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేవు.
అందుకనే కాంగ్రెస్ తో పొత్తుకోసం సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది. `చలో సెక్రటేరియట్’ ఉద్యమం సందర్భంగా అరెస్ట్ అయినా షర్మిలకు రెండు వామపక్షాలు సంఘీభావం తెలిపారు. వ్యక్తిగతంగా ఆమెను కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా, షర్మిల మాట్లాడుతూ వైసీపీ, టీడీపీ-బీజేపీకి తొత్తులుగా మారాయని, ఆంధ్ర రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ హక్కుల కోసం తమ పార్టీ పోరాడుతోందని, ఈ ప్రయాణంలో భాగంగా వామపక్షాలతో పొత్తు ఉంటుందని ఆమె ప్రకటించారు కూడా.
ఆంధ్రరత్న భవన్లో శుక్రవారం వామపక్ష పార్టీలతో కాంగ్రెస్ నేతలు భేటీ అనంతరం షర్మిల మాట్లాడుతూ తామంతా ఏపీ ప్రజల కోసం కలిసి పోరాడే అంశంపై చర్చలు జరిపామని తెలిపారు. తామంతా కలిసికట్టుగా పోరాటాలు చేస్తామని చెబుతూ అనంతపురంలోతాను హరాజయ్యే సభకు సీపీఐ, సీపీఎంలను ఆహ్వానించామని చెప్పారు. ఎన్నికల్లో పొత్తు, సీట్ల సర్దుబాట్లపై చర్చలు జరుగుతున్నాయని, పొత్తులపై త్వరలో అన్ని అంశాల మీద స్పష్టత వస్తుందని ఆమె తెలిపారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ బీజేపీ ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు. బీజేపీ, వైసీపీ, టీడీపీ మీదనే తమ పోరాటం ఉంటుందని చెబుతూ ఈ కూటములు రాష్ట్రాన్ని ఘోరంగా మోసం చేశాయని విమర్శించారు. ప్రధాన ప్రాంతీయ పార్టీలు బీజేపీకి భయపడుతున్నాయని చెబుతూ జగన్, బాబు, జనసేన అధినేత పవన్ కూడా మోదీకి దాసోహం అంటున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు.