సమాజ్వాది పార్టీ (ఎస్పి) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆదివారం ఆగ్రాలో రాహుల్ గాంధీ సారథ్యంలోని ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో చేరారు. రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఉత్తర ప్రదేశ్లో ఎస్పి, కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకం ఒప్పందం కుదిరిన కొన్ని రోజులకు ఈ పరిణామం సంభవించింది.
ఎస్పి, కాంగ్రెస్ కార్యకర్తలు ఇద్దరు అగ్ర నేతలకు మద్దతుగా నినాదాలు చేశారు. ఇద్దరు నేతలు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో కలసి యాత్ర కోసం చేరిన జనం వైపు చేతులు ఊపారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఇప్పుడు రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. రైతుల బలానికి ప్రభుత్వం బెదురుతోంది. రానున్న కాలంలో బిజెపికి అధికార చ్యుతి కలుగుతుంది. ఇండియా కూటమి ప్రభుత్వం రైతులకు గౌరవం ఇస్తుంది’ అని అఖిలేశ్ చెప్పారు.
వెనుకబడిన తరగతులు, దళితులు, మైనారిటీ వర్గాలకు సముచిత గౌరవాన్ని బిజెపి ఇవ్వలేదని అఖిలేశ్ ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్లో కాంగ్రెస్ సీనియర్ నేత ప్రదీప్ మాథుర్ కూడా ఈ యాత్రకు హాజరయ్యారు. ‘రాహుల్జీ, ప్రియాంకజీ, అఖిలేశ్జీ నాయకత్వంలో మేము లోక్సభ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు సాధిస్తాం’ అని ప్రదీప్ మాథుర్ ధీమా వ్యక్తం చేశారు.
రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్న కీలక ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవే కావడం గమనార్హం. ఇప్పటివరకు రాహుల్ యాత్రలో పాల్గొన్న ప్రతిపక్ష నేతలెవరూ అఖిలేష్ యాదవ్ స్థాయిలో లేరు. ఇటీవల పశ్చిమబెంగాల్ మీదుగా రాహుల్గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర సాగింది. అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ యాత్రలో పాల్గొనలేదు.
కాగా, ఉత్తరప్రదేశ్లో లోక్సభ స్థానాల పంపకం విషయంలో సమాజ్వాది-కాంగ్రెస్ పార్టీల మధ్య కొద్ది రోజులపాటు కొనసాగిన ప్రతిష్ఠంభనకు ఇటీవలే తెరపడింది. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శ ప్రియాంకాగాంధీ సమాజ్వాది పార్టీ ఆఫర్ చేసిన 17 సీట్లకు అంగీకారం తెలుపడంతో ఆ ప్రతిష్ఠంభనకు ఫుల్స్టాప్ పడింది. ఈ క్రమంలో ఇవాళ రాహుల్గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు.