బెంగళూరు నగరంలోని వైట్ఫీల్డ్కు చెందిన బ్రూక్ఫీల్డ్ ప్రాంతంలోగల ప్రముఖ హోటల్ రామేశ్వరం కేఫ్లో శుక్రవారం పేలుడు సంభవించి 9 మంది గాయపడ్డారు. తొలుత ఈ ప్రమాదానికి ఎల్పిగ్లీకేజి కారణమని భావించినప్పటికీ ఆ అవకాశం లేదని అగ్నిమాపక శాఖ తోసిపుచ్చింది. ఘటనా స్థలంలో ఒక మహిళకు చెందిన హ్యాండ్బ్యాగ్ లభించిందని, పేలుడుకు అసలు కారణాన్ని నిర్ధారించే ప్రయత్నంలో ఫోరెన్సిక్ బృందాలు ఉన్నాయని ఆ శాఖ అధికారులు తెలిపారు.
పేలుడులో గాయపడిన వారిలో ఇద్దరు సిబ్బంది, ఏడుగురు కస్టమర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిని నగరంలోని వివిధ ఆసుపత్రులలో చేర్పించి చికిత్స అందచేస్తున్నారు. కేఫ్లో మహిళ తెచ్చిన బ్యాడులోనే పేలుడు సంభవించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేఫ్ లోపల, వెలుపల అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు సిసి టివి ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం పోలీసుల దిగ్బంధంలో ఉన్న కేఫ్ను కర్నాటక డిజిపి అలోక్ మోహన్, బెంటళూరు పోలీసు కమిషనర్ బి దయానంద పరిశీలించారు. ఎన్ఐఎ, ఐబి అధికారులకు సమాచారం అందచేసినట్లు డిజిపి తెలిపారు. మధ్యాహ్నం 1.08 గంలకు కేఫ్లో ఎల్పిజి లీకేజి జరిగినట్లు తమకు ఫోన్ కాల్ వచ్చిందని కర్ణాటక రాష్ట్ర అగ్నిమాపక, అత్యవసర సర్వీసుల శాఖ డైరెక్టర్ టిఎన్ శివశంకర్ తెలిపారు. అక్కడకు చేరుకున్న తమ అధికారులు, బృందాలకు మంటలు కనిపించలేదని ఆయన చెప్పారు.
కేఫ్లో మరో ఆరుగరితో కలసి కూర్చుని ఉన్న ఒక మహిళ వెనుక పెట్టిన బ్యాగులో పేలుడు జరిగిందనిఆయన చెప్పారు. ఆ బ్యాగులో ఉన్న పదార్థం వల్లే పేలుడు సంభవించి ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఆ బ్యాగు ఎవరిదో ఇంకా నిర్ధారణ కాలేదని ఆయన చెప్పారు. గాయపడిన వారిలో బ్యాగు సమీపంలో కూర్చుని ఉన్న మహిళ కూడా ఉందని, ఆమెకు ఆసుపత్రిలో చికిత్స అందుతోందని ఆయన తెలిపారు.
కేఫ్లో వంట గ్యాసు సిలిండర్ లీకేజీ అయ్యే అవకాశమే లేదని ఆయన చెప్పారు. తాను, ఇతర అధికారులు ఆ ప్రదేశాన్ని పరిశీలించామని, ఎల్పిజి సిలిండర్ నుంచి గ్యాస్ లీకైన ఆనవాళ్లు ఏవీ కనిపించలేదని ఆయన చెప్పారు.