లోక్సభ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ అకౌంట్లపై ఆదాయం పన్ను శాఖ చర్యను నిలివేయాలని కోరుతూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ను ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. అలాంటి ఉత్తర్వులు జారీ చేసే అధికారం తమకు లేదని స్పష్టం చేసింది.
కాంగ్రెస్ పార్టీ అకౌంట్లను స్తంభింప చేసి, బకాయిలు వసూలుకు ఐటీ శాఖ చర్యలు తీసుకోవడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. ఐటీ శాఖ చర్యను పది రోజుల పాటు సస్పెండ్ చేయాలని, ఈలోపు తాము హైకోర్టుకు వెళ్తామని ఐటీఏటీ కాంగ్రెస్ తరఫు న్యాయవాది వివేక్ తన్ఖా అప్పిలేట్ ట్రిబ్యునల్ను కోరారు.
ఫిబ్రవరి 22న విచారణ సందర్భంగా ఆయన తన వాదనను కోర్టు ముందుంచుతూ, పార్టీ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోందని, ముఖ్యంగా ఎన్నికల ప్రచారానికి నిధులు అవసరమని తెలిపారు. అయితే ఈ వాదనను ఐడీ శాఖ తోసిపుచ్చింది. బకాయిల వసూలుకు తమ చర్య అవరోధం కాదని, ఆ పార్టీకి తగినన్ని నిధులున్నాయని చెబుతోంది.
కాంగ్రెస్ పార్టీ బ్యాంకు అకౌంట్లను ఐటీ శాఖ స్తంభింపచేసినట్టు కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ ఇటీవల ఆరోపించారు. రూ.210 కోట్ల బకాయిల పేరుతో తమ అకౌంట్లను స్తంభింపజేసినట్టు చెప్పారు. అయితే, బ్యాంకు అకౌంట్లను ఆపరేట్ చేసుకునేందుకు ఐటీఏటీ కాంగ్రెస్కు అనుమతి ఇచ్చినట్టు వివేక్ తన్ఖా ఆ తరువాత వివరణ ఇచ్చారు. ఐటీ శాఖ సైతం కాంగ్రెస్ బ్యాంకు అకౌంట్ల లావాదేవీలను స్తంభింపజేయాలని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది.