లోక్సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం నియమ నిబంధనలను కేంద్ర హోంశాఖ సోమవారం నోటిఫై చేసింది. కాగా, కేంద్ర ప్రభుత్వం 2019 డిసెంబర్లోనే పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించిన బిల్లును పార్లమెంట్లో ఆమోదింపచేసుకొన్నది.
మతపరమైన హింస కారణంగా 2014, డిసెంబర్ 31 కంటే ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్ నుంచి భారత్కు వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్ మతస్తులకు పౌరసత్వం ఇచ్చేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.
అయితే 1955 పౌరసత్వ చట్టాన్ని సవరిస్తూ తీసుకొచ్చిన ఈ కొత్త చట్టంలో ముస్లింలను మినహాయించడం వివాదానికి దారితీసింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రధానంగా ఈశాన్య రాష్ర్టాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. 2019 లోక్సభ ఎన్నికలకు ముందే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ను బీజేపీ సర్కారు తెరపైకి తీసుకువచ్చింది.
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తడంతో సీఏఏ అమలును తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు అప్పట్లో కేంద్రం ప్రకటించింది. తాజాగా ఇప్పుడు కూడా లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్రం పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఆ మేరకు నిబంధనలను నోటిఫై చేసింది.
ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్షాతో పాటు కేంద్రమంత్రులు సైతం ఎన్నికలకు ముందే సీసీఏను అమలులోకి తీసుకువస్తామని ప్రకటించారు. ఆ మేరకు ఇప్పుడు సీఏఏ అమల్లోకి వచ్చింది.
రానున్న లోక్సభ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే కేంద్ర ప్రభుత్వం సీఏఏ అమలు కోసం నోటిఫికేషన్ జారీ చేసిందని విపక్షాలు భగ్గుమన్నాయి. ఎన్నికలకు ముందు పౌరసత్వ సవరణ చట్ట నిబంధనలను కేంద్రం నోటిఫై చేయడం మతప్రాతిపదికన ఓటర్లను విభజించేందుకేనని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, అసోంలో ప్రజల మధ్య విభజన చిచ్చు రాజేసేందుకేనని ధ్వజమెత్తారు.
లోక్సభ ఎన్నికలకు తేదీలు ప్రకటించేందుకు కొన్ని రోజుల ముందు సీఏఏ అమలు కేవలం రాజకీయ కారణాలతోనే చేపట్టారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు డ్రామా చేస్తున్నారని ఎద్దేవా చేశారు.