హర్యానాలో బీజేపీ సీనియర్ నేత, ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా నేపథ్యంలో హర్యానా కొత్త సీఎంగా నయాబ్ సింగ్ సైనీని ఎంపిక చేసినట్లు బిజెపి ప్రకటించింది. సైనీ సాయంత్రం 5 గంటలకు హర్యానా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి అధికారంలో ఉన్న హర్యానాకు కొత్త ముఖ్యమంత్రి రానున్నారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా పని చేసిన బీజేపీ సీనియర్ నాయకుడు మనోహర్ లాల్ ఖట్టర్.. తన పదవికి రాజీనామా చేయడంతో కొత్త సారథిని ఎన్నుకోవాల్సి వచ్చింది.
ఖట్టర్ రాజీనామా చేయడం వల్ల ఏర్పడిన ఖాళీని లోక్సభ సభ్యుడు నాయబ్ సింగ్ సైనీతో భర్తీ చేసింది బీజేపీ హైకమాండ్. ఆయనను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది. ఈ మేరకు చండీగఢ్లో బీజేపీ శాసనసభా పక్షం సమావేశంలో ఈ ప్రక్రియ పూర్తయింది. నాయబ్ సింగ్ పేరును ఎమ్మెల్యే కిషన్ లాల్ మిధ్నా ప్రతిపాదించారు. అనంతరం మిగిలిన సభ్యులు ఏకగ్రీవంగా ఆయనను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు.
బీజేపీ- జన్నాయక్ జనత పార్టీ కూటమి ప్రభుత్వానికి తొలుత ఉదయం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు. ఖట్టర్ నాయకత్వాన్ని మిత్రపక్షం జన్నాయక్ జనతా పార్టీ వ్యతిరేకించడమే కారణంగా భావిస్తున్నారు. నయాబ్ సింగ్ సైనీ ప్రస్తుతం హర్యానా బీజేపీ అధ్యక్షుడు, కురుక్షేత్ర లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు
నయాబ్ సింగ్ సైనీకి 1996 నుంచి బీజేపీతో అనుబంధం ఉంది. 2002లో భారతీయ జనతా పార్టీ యువమోర్చా, అంబాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2005లో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2009లో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా హర్యానా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
సైనీ 2010లో నారాయణ్ గఢ్ నుంచి మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2014లో ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ క్రమంలోనే 2015లో మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2019లో కురుక్షేత్ర స్థానం నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నిర్మల్ సింగ్పై 3.85 లక్షల ఓట్లతో విజయం సాధించారు. మనోహర్ లాల్ ఖట్టర్కు సైనీ అత్యంత సన్నిహితుడు.