ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చారని నాగర్ కర్నూల్ బిజెపి బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మళ్లీ బిజెపిని గెలిపించాలని ప్రజలు నిర్ణయానానికి వచ్చారని చెబుతూ నాగర్ కర్నూలు ప్రజలు కూడా ఈ సారి బిజెపిని గెలిపించాలని ప్రధాని ప్రజలను కోరారు. నిన్న మల్కాజ్ గిరిలో బిజెపి ర్యాలీ బ్రహ్మాండంగా సాగిందని చెబుతూ మల్కాజ్ గిరిలో ప్రజలు వీధుల్లో బారులు తీరి బిజెపికి మద్దతు తెలిపారని ప్రధాని చెప్పారు.
బిఆర్ఎస్ పట్ల తమ కోపాన్ని ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో చూపారన్న ప్రధాని సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి కూడా బిజెపినే గెలిపించాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని ఆయన పేర్కొన్నారు. పదేళ్లుగా బిఆర్ఎస్, కాంగ్రెస్ తెలంగాణ ప్రజల కలలను చిదిమేశాయని విమర్శించారు. పదేళ్లుగా బిఆర్ఎస్ అవినీతికి పాల్పడితే.. ఇప్పుడు తమ వంతు వచ్చిందని కాంగ్రెస్ భావిస్తోందని ధ్వజమెత్తారు.
తెలంగాణను దక్షిణ భారతానికి ముఖ ద్వారమని చెబుతున్నారని, తెలంగాణలోనూ ఈ సారి బిజెపికి 400 సీట్లు అనే నినాదం వినిపిస్తోందని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. బిజెపిను గెలిపించండి.. మీ ఆకాంక్షలను బిజెపి నెరవేరుస్తోందని ప్రధాని భరోసా ఇచ్చారు. తెలంగాణను నాశానం చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి ఈ ఐదేళ్లు చాలని హెచ్చరించారు. బిజెపి ఎంపిలను భారీ సంఖ్యలో గెలిపిస్తే.. అప్పుడు కాంగ్రెస్ ఆటలు సాగవని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ గరీబీ హఠావో అని దశాబ్దాల క్రితమే నినాదం ఇచ్చింది.. కానీ పేదరికం పోయిందా? అని ప్రధాని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన అంతా మోసం, దోపిడీ మాత్రమేనని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబిసీలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగానే చూసిందని, అయితే బిజెపికి పూర్తి మెజారిటీ వచ్చిన తర్వాతే దేశంలో మార్పు మొదలైందని పేర్కొన్నారు.
మార్పునకు గ్యారంటీ మోదీ గ్యారంటీ మాత్రమేనని స్పష్టం చేశారు. మోదీ చెప్పాడంటే.. అది చేసి తీరుతాడని భరోసా ఇచ్చారు. ఆర్టీకల్ 370, అయోధ్య రామాలయ నిర్మాణం ఇందుకు కొన్ని ఉదాహరణలు అన్నారు. గత 23 ఏళ్లుగా సిఎంగా, పిఎంగా ప్రజలకు సేవలు అందిస్తున్నా.. నేను నా కోసం.. ఒక్క రోజు కూడా వినియోగించుకోలేదని చెప్పారు.
తెలంగాణ ప్రజల కోసం కోటి బ్యాంకు ఖాతాలు తెరిచాం.. కోటిన్నర మంది తెలంగాణ ప్రజలకు ఆరోగ్య బీమా కల్పించామని ప్రధాని తెలిపారు. తెలంగాణలో 67 లక్షల మందికి ముద్రా రుణాలు అందించామని ప్రధాని చెప్పారు. తెలంగాణలో మాదిగలను బలోపేతం చేసేందుకు నిర్ణయించామని పేర్కొన్నారు. తెలంగాణలో 80 లక్షల మంది ఆయుష్మాన్ పథకం కింద లబ్ది పొందారని చెప్పారు. బిజెపి పాలనలో అధిక లాభం ఎస్సీ, ఎస్టీ, ఓబిసి, రైతులకే దక్కుతుందని తెలిపారు.
కాంగ్రెస్ సామాజిక న్యాయం పేరుతో రాజకీయంగా పబ్బం గడుపుకుంటోందని ప్రధాని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ,ఓబిసిలను కాంగ్రెస్ ఎప్పుడూ అవమానిస్తూనే ఉందని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గతంలో అంబేద్కర్ ను సైతం ఎన్నికల్లో ఓడించిందని పేర్కోన్నారు. గిరిజన మహిళ ముర్మును రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కూడా యాదాద్రిలో కాంగ్రెస్ అవమానించిందని ప్రధాని మోదీ గుర్తుచేశారు.