కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థుల రెండో జాబితాను ఎట్టకేలకు గురువారం రాత్రి ఎఐసిసి విడుదల చేసింది. మొత్తం 57 మంది అభ్యర్థులను ఈ జాబితాలో చోటు దక్కిం ది. ఎఐసిసి విడుదల చేసిన ఈ జాబితా లో తెలంగాణకు చెందిన ఐదుగురు పేర్లు మాత్రమే ఉన్నాయి. మిగతా స్థానాలపై ఉత్కంఠ మరింత పెరిగింది.
పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, మల్కాజిగిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి, నాగర్ క ర్నూల్ నుంచి మల్లు రవి, చేవెళ్ల నుంచి గడ్డం రంజిత్రెడ్డిల పేర్లను ఖరారు చేస్తూ ఏఐసిసి జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ జాబితా విడుదల చేశారు.
మొదటి విడతలో నలుగురు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, రెండో విడతలో 5 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 8 సీట్లకు సంబంధించి అభ్యర్థుల జాబితాను ప్రకటించే విషయంలో ఆలస్యం చేస్తుండడంతో ఆశావహులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆశావహులు ఢిల్లీలో ఏఐసిసి పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి క్యూ కడుతున్నారు.
ఈ క్రమంలోనే 8 మంది అభ్యర్థుల జాబితాను (కాంగ్రెస్ మూడో జాబితాను) హోలీ తర్వాతే ప్రకటించే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటుండడంతో టికెట్లు ఆశిస్తున్న ఆశావహులు జాబితా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఫ్లాష్ సర్వేల పేరుతో పలు దఫాలుగా క్షేత్రస్థాయి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న అధిష్ఠానం ఈ మేరకు గెలిచే అభ్యర్థులను బరిలోకి దింపేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
అందులో భాగంగా మూడో జాబితాను పెండింగ్లో ఉంచడం వెనుక వ్యూహాత్మకంగా వ్యవహారిస్తోందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ పెండింగ్ స్థానాలను ప్రకటించకపోవడం వెనుక అభ్యర్థులపై ఆర్థిక భారం పడకూడదన్న ఆలోచన ఉందన్న చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.