భారత మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్ కె అద్వానీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత రత్న పురస్కారం ప్రదానం చేశారు. అద్వానీ అనారోగ్యం కారణంగా రాష్ట్రపతి స్వయంగా ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లి పురస్కారాన్ని అందజేశారు. రాష్ట్రపతితోపాటు ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కడ్, ప్రధాని నరేంద్రమోదీ, హోమ్ మంత్రి అమిత్ షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు అద్వానీ నివాసానికి వెళ్లిన వారిలో ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది భారత రత్న కోసం ఐదుగురు పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా.. శనివారం దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో భారత రత్న అవార్డులను ప్రదానం చేసింది. కానీ అనారోగ్య సమస్యల కారణంగా అద్వానీ పాల్గొనలేకపోవడంతో ఆయన ఇంటికి వెళ్లి మళ్లీ భారత రత్నను రాష్ట్రపతి అందించారు.
‘ఎల్కే అద్వానీకి భారతరత్న రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ గౌరవం దక్కినందుకు ఆయనతో మాట్లాడి అభినందనలు తెలిపాను. మన కాలపు అత్యంత గౌరవనీయమైన రాజనీతిజ్ఞులలో ఒకరైన ఆయన భారతదేశ అభివృద్ధికి చేసిన కృషి చిరస్మరణీయం. అట్టడుగు స్థాయి నుంచి ఉపప్రధానిగా దేశానికి సేవలందించే స్థాయికి ఎదిగిన జీవితం ఆయనది. మన హోం మంత్రిగా, సమాచార ప్రసార శాఖ మంత్రిగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన పార్లమెంటరీ జోక్యాలు ఎల్లప్పుడూ ఆదర్శవంతమైనవి, గొప్ప అంతర్దృష్టులతో నిండి ఉన్నాయి” అని.. అద్వానీకి భారత రత్నను ప్రకటిస్తూ.. గతంలో ట్వీట్ చేశారు నరేంద్ర మోదీ.
1927 నవంబర్ 8న ప్రస్తుత పాకిస్థాన్లోని కరాచీలో జన్మించిన అద్వానీ విశిష్టమైన రాజకీయ జీవితం గడిపారు. 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నుంచి సుదీర్ఘకాలం ఆ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1999 నుంచి 2004 వరకు అటల్ బిహారీ వాజ్పేయి మంత్రివర్గంలో హోంమంత్రిగా, ఉప ప్రధానిగా అద్వానీ పనిచేశారు.
తన మేధో చాతుర్యం, అచంచలమైన సూత్రాలు, బలమైన- సంపన్న భారతదేశం కోసం మద్దతుగా నిలిచి ఎందరి నుంచి ప్రశంసలు అందుకున్న అద్వానీని భారత రాజకీయాల్లో ఒక మహోన్నత వ్యక్తిగా భావిస్తారు. జాతీయవాదంపై తన ప్రధాన విశ్వాసం విషయంలో అద్వానీ ఎన్నడూ రాజీపడలేదని అటల్ బిహారీ వాజ్ పేయి ఒకసారి చెప్పారు.