పదేళ్లలో వందేళ్ల విధ్వంసం జరిగిందని, బిఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని, రాష్ట్రం వందేళ్లు కోలుకోలేనంత ధ్వంసం అయ్యిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫైర్ అయ్యారు. మంగళవారం తుక్కుగూడ సభా ప్రాంగణాన్ని సిఎం రేవంత్రెడ్డితో పాటు చేవెళ్ల ఎంపి అభ్యర్థి రంజిత్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ పదేళ్ల తర్వాత అయినా మాజీ సిఎం కెసిఆర్ పొలం బాట పట్టడం సంతోషకరమన్నారు.
బిఆర్ఎస్ అధికారం కోల్పోయినందుకు, కవిత జైలుకు పోయినందుకు కెసిఆర్ను చూస్తుంటే జాలి కలుగుతుందని చెబుతూ కవిత బెయిల్ కోసం కెసిఆర్ కుటుంబం ప్రధాని మోదీ కాళ్లు పట్టుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. కెసిఆర్ అధికారం కోల్పోయిన బాధలో ఉన్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. ఆయన చేసిన పాపాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఖాతాలో వేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు వేయడానికి 10 నెలల సమయం తీసుకుందన్నారు. 65 లక్షల రైతుల ఖాతాలో తాము రైతుబంధు వేశామని, మిగిలింది 4 లక్షల రైతులేనని ఎన్నికలు అయిపోగానే వీరికి కూడా రైతుబంధు వేస్తామని సిఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు.
బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో తాము ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే తమను ఎక్కడికక్కడ అరెస్ట్లు చేశారని, కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో కెసిఆర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. తాము తలుచుకుంటే కెసిఆర్ బయటకు వెళ్లేవారా? అని ఆయన ప్రశ్నించారు. బిఆర్ఎస్ ఖాతాలో రూ. 1,500 కోట్లు ఉన్నాయని, రైతులకు రూ.100 కోట్లు సాయం చేయొచ్చు కదా అని ఆయన చెప్పారు.
ఎంపి ఎన్నికల కోసమే కెసిఆర్ రైతులపై కపట ప్రేమ చూపుతున్నారని సిఎం రేవంత్రెడ్డి సెటైర్లు వేశారు. ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేశామని సిఎం రేవంత్ వివరించారు. కెసిఆర్ మాదిరిగా తాము కమీషన్ల దందా చేయడం లేదని, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ పనుల కోసమే ఢిల్లీకి వెళ్తున్నామని సిఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు.
కెసిఆర్ కుటుంబ దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని చెబుతూ కెసిఆర్ పాపాల వల్ల బిఆర్ఎస్ ఎంపి అభ్యర్థులు పారిపోతున్నారని సిఎం రేవంత్ ఆరోపించారు. ఆ పార్టీ నేతలను కాపాడుకోవడానికి కెసిఆర్ డ్రామాలు ఆడుతున్నారన్నారు. బిఆర్ఎస్ చెల్లని వెయ్యి రూపాయల నోటని సిఎం రేవంత్ ఎద్దేవా చేశారు.
జూన్ 9వ తేదీ తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని సిఎం రేవంత్ చెప్పారు. ఆ రోజే ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా కూటమి ప్రమాణ స్వీకారం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
బిఆర్ఎస్ పదేళ్లలో చేసిన దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు 24 గంటలు కష్టపడుతున్నామని, పేదలకు మంచి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని సిఎం రేవంత్ తెలిపారు. గతేడాది వానాకాలంలో రాష్ట్రంలో వర్షాలు సరిగ్గా పడకపోవడంతో గ్రౌండ్ వాటర్ లెవల్స్ తగ్గిపోయాయని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో సైతం నీటిమట్టాలు డెడ్ స్టోరేజ్కు పడిపోయాయని రేవంత్ తెలిపారు.
రైతులకు కొంత నష్టమైనా తాగునిటీకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని రేవంత్ స్పష్టం చేశారు. ట్యాంకర్లతో ప్రజలకు తాగునీటి సరఫరా చేస్తామన్నారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని పథకాలను రాష్ట్రంలో అమలు చేసేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని సిఎం రేవంత్ కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అన్ని సమస్యలు ఉన్నాయని, నీళ్లు ఎత్తిపోయడం ఎలా సాధ్యమవుతుందని సిఎం రేవంత్ ప్రశ్నించారు. వేసవిలో నీటి సమస్యలు రాకుండా పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
బిఆర్ఎస్, బిజెపి ఒక్కటేనని ఈ రెండు పార్టీలు లోక్సభ ఎన్నికల్లో కుట్రకు తెరదీశాయని రేవంత్ ఆరోపించారు. చనిపోయిన రైతుల వివరాలు ఇచ్చేందుకు కెసిఆర్కు 48 గంటల సమయం ఇస్తున్నానమన్నారు. ఆ లోగా రైతుల వివరాలు ఇస్తే ఎన్నికల కోడ్ ముగియగానే రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తానని సిఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు.