కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తనదైనశైలిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తమ ఆస్తిగా భావించిన వారు.. ఆ పార్టీని తమ పిల్లలకు వంశపారంపర్యంగా ఇచ్చారంటూ సోనియా గాంధీ కుటుంబంపై ప్రధాని మోదీ పరోక్షంగా విమర్శించారు. కానీ భారతీయులు మాత్రం తమ వంశపారం పర్యంగా వచ్చిన ఆస్తిని.. వారి పిల్లలకు చెందకుండా ప్రయత్నం చేస్తుందంటూ ఆ పార్టీపై మండిపడ్డారు.
ఎన్నికల ప్రచారంలోభాగంగా బుధవారం ఛత్తీస్గఢ్లోని సుగుజాలో ప్రధాని మోదీ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. ప్రజల సంపదపై సర్వే నిర్వహిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలపై అధిక పన్నులు భారం మోపడం ద్వారా వారి పిల్లలకు ఆస్తుల లేకుండా చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు.
తల్లితండ్రులకు చెందిన ఆస్తులు.. తమ పిల్లలకు కేవలం 50 శాతం మాత్రం వెళ్లాలని, మిగితా 50 శాతం ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లాలని పిట్రోడా ఇటీవల కామెంట్ చేశారు. ఆ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వద్ద ప్రమాదకర ఆలోచనలు ఉన్నాయని మోదీ ఆరోపించారు.
మధ్యతరగతి ప్రజల వద్ద అధిక మొత్తంలో పన్నులు వసూల్ చేయాలని గాంధీ కుటుంబానికి చెందిన సలహాదారుడు కామెంట్ చేశారని, ఇప్పుడు మరింత దూకుడుగా ఆయన మాట్లాడారని, వారసత్వ సంపదపై పన్ను వసూల్ చేయాలని కాంగ్రెస్ ప్లాన్ వేస్తోందని మోదీ ఆరోపించారు.
జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్మును మీ పిల్లలకు ఇవ్వకుండా లాక్కునే ప్లాన్ కాంగ్రెస్ చేస్తోందని, బ్రతికి ఉన్నప్పుడు లూటీ చేయడమే కాకుండా మరణించిన తర్వాత కూడా లూటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. బ్రతికున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ట్యాక్సును వసూల్ చేస్తుందని, చనిపోయిన తర్వాత కూడా వారసత్వ ట్యాక్స్ను వసూల్ చేస్తుందని ఆయన ఆరోపించారు.
సోనియా గాంధీ కుటుంబానికి సలహాదారు శ్యామ్ పిట్రోడ్ గతంలో మధ్య తరగతి ప్రజల నుంచి అధిక పన్నులు వసూలు చేయాలని సూచించారని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. వంశపారంపర్య పన్ను విధానాన్ని అమలు చేసేందుకు కాంగ్రెస్ చూస్తుందని మండిపడ్డారు. మీరు మీ పిల్లలు కోసం కష్టపడి సంపాదించిన సంపాదనను.. వారికి కాకుండా చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.