ఐపీఎల్ 2024 టైటిల్ను కోల్కతా నైట్రైడర్స్ కైవసం చేసుకుంది. సన్రైజర్స్ హైదరాబాద్తో చెన్నై వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో కోల్కతా నైట్రైడర్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడారు. మెంటార్గా గౌతమ్ గంభీర్ రీఎంట్రీ.. కోల్కతా నైట్రైడర్స్ను ఛాంపియన్గా నిలబెట్టింది.
మరోసారి పేలవ బ్యాటింగ్తో సన్రైజర్స్ హైదరాబాద్ చిత్తయ్యింది. ఈ సీజన్లో కేకేఆర్తో జరిగిన మూడు మ్యాచ్ల్లోనూ ఆరెంజ్ ఆర్మీకి నిరాశ తప్పలేదు. హోరాహోరీ పోరు తప్పదనుకున్న ఈ ఫైనల్ మ్యాచ్.. సన్రైజర్స్ బ్యాటర్ల పేలవ ప్రదర్శన కారణంగా ఏకపక్షంగా ముగిసింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 113 పరుగులకు కుప్పకూలింది. ఎయిడెన్ మార్క్రమ్(23 బంతుల్లో 3 ఫోర్లతో 20), ప్యాట్ కమిన్స్(19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా రెండేసి వికెట్లు తీయగా.. ఆండ్రీ రస్సెల్(3/19) మూడు వికెట్లు పడగొట్టాడు. వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తీ, సునీల్ నరైన్ తలో వికెట్ తీసారు. ఐపీఎల్ చరిత్రలోనే ఫైనల్లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా సన్రైజర్స్ చెత్త రికార్డ్ నమోదు చేసింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ 10.3 ఓవర్లలో 2 వికెట్లకు 114 పరుగులు చేసి 57 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. సునీల్ నరైన్(6) విఫలమైనా.. రెహ్మానుల్లా గుర్బాజ్(32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 39), వెంకటేశ్ అయ్యర్(26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 52 నాటౌట్) సత్తా చాటారు.
సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్, షెహ్బాజ్ అహ్మద్ తలో వికెట్ తీసారు. ఈ టోర్నీ ఆసాంతం కేకేఆర్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఐపీఎల్- 2024 మొత్తం అదరగొట్టిన కోల్కతా బౌలర్లు ఫైనల్లో అంతకుమించి చెలరేగడం విశేషం. ఏ దశలోనూ సన్రైజర్స్ను కోలుకోనివ్వలేదు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ రైజర్స్ను తక్కువ స్కోరుకే పరిమితం చేసింది.
తొలి ఓవర్లోనే అభిషేక్ (2) వికెట్ తీసి శుభారంభం అందించాడు మిచెల్ స్టార్క్. మరుసటి ఓవర్లో ట్రావిస్ హెడ్ను (0) అద్భుత బంతితో పెవిలియన్ చేర్చాడు వైభవ్ అరోరా. క్వాలిఫయర్-1, 2 హీరో రాహుల్ త్రిపాఠి భారీ షాట్కు (9) ప్రయత్నించి స్టార్క్ బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు.
మిడిల్ ఓవర్లలో రసెల్, హర్షిత్ రాణా వికెట్ల పతనాన్ని శాసించారు. రైజర్స్ బ్యాటర్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (24) టాప్ స్కోరర్ కావడం విశేషం. మార్క్రమ్ (20) రన్స్ చేయగా మరెవరూ 20 కూడా చేయలేకపోయారు. క్లాసెన్ (16), నితీశ్ రెడ్డి (13) పరుగులు చేయగా.. తర్వాత అత్యధికం ఎక్స్ట్రాల (13) రూపంలో వచ్చాయి.
కోల్కతా బౌలర్లలో రసెల్ 2.3 ఓవర్లలో 19 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. 3 ఓవర్లలో 14 రన్స్ ఇచ్చిన స్టార్క్, 4 ఓవర్లలో 24 రన్స్ ఇచ్చిన హర్షిత్ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. వైభవ్ అరోరా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు.