నీట్ పరీక్షల్లో అవకతవకలపై పార్లమెంటు ఉభయసభలు శుక్రవారం దద్దరిల్లాయి. నీట్పై సమగ్ర చర్చను చేపట్టాలన్న తమ డిమాండ్కు అధికారపక్షం అంగీకరించకపోవటంతో ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తొలుత చర్చిద్దామని, ఆ సందర్భంగా నీట్పైనా చర్చ జరపవచ్చన్న ప్రభుత్వ సూచనకు విపక్షాలు అంగీకరించలేదు.
దీంతో ఉభయసభల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఫలితంగా పలుమార్లు వాయిదా పడ్డాయి. ఉదయం లోక్సభ సమావేశం కాగానే.. నీట్తోపాటు ఇతర పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకైన ఘటనలపై చర్చను కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇతర కార్యకలాపాలను రద్దు చేసి పేపర్ లీకేజీలపై చర్చను చేపడదామని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు.
దీనిపై స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ.. ఇటీవల దివంగతులైన 13 మంది మాజీ ఎంపీలకు తొలుత నివాళి అర్పిద్దామని చెప్పారు. నివాళి ముగియగానే విపక్ష ఎంపీలు మళ్లీ తమ డిమాండ్ను కొనసాగించారు. నీట్ చాలా ముఖ్యమైన అంశమని, దానిపై చర్చ అవసరమని ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ పేర్కొన్నారు.
అయితే, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరపాలని ఇప్పటికే నిర్ణయించామని, ఆ చర్చలోనే అన్ని అంశాలనూ లేవనెత్తవచ్చని, తగిన సమయం ఇస్తానని స్పీకర్ చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ముందే మరో అంశంపై చర్చిద్దామని విపక్షం కోరటం గతంలో ఎన్నడూ జరగలేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రిజిజు పేర్కొన్నారు.
సభలో ప్రతిష్టంభన నేపథ్యంలో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ఇటువంటి గందరగోళమే నెలకొంది. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చను పక్కనపెట్టి, ముందుగా నీట్పై చర్చిద్దామని విపక్షాలు డిమాండ్ చేశాయి. విపక్ష నేత ఖర్గే వెల్లోకి రావటం తనను తీవ్రంగా బాధించిందని ధన్కడ్ పేర్కొన్నారు.
కాగా, నిరసన సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ఫూలోదేవినేతమ్ కళ్లు తిరిగి పడిపోయారు. ఆమెను ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించారు. ఎంపీ బీపీ తీవ్రంగా పెరిగిందని, దాదాపుగా పక్షవాతం వచ్చే స్థాయిలో ఉందని వైద్యులు తెలిపినట్లుగా ఇతర ఎంపీలు వెల్లడించారు. చికిత్స తర్వాత ఫూలోదేవి కోలుకున్నారు.