జమ్మూకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల కమిషన్ శుక్రవారం ప్రకటించింది. 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి మూడు విడతలుగా సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1వ తేదీల్లో ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న కౌంటింగ్ జరిపి ఫలితాలు వెల్లడిస్తారు.హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 1న నిర్వహించనున్నారు. అక్టోబర్ 4న ఫలితాలు ప్రకటిస్తారు.
ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ‘2024 లోక్సభ ఎన్నికలు ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ. ఆ ఎన్నికలు విజయవంతంగా, శాంతియుతంగా పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా యువత మొదలుకుని వృద్ధుల వరకు భారీ సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యంగా జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు ఎంతో చైతన్యం చూపించారు. ఈసారి వారు హింసను పక్కనపెట్టి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకే మొగ్గు చూపారు’ అని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల (2024) షెడ్యూల్ ప్రకారం మూడు విడతల్లో పోలింగ్ జరుగనుంది. తొలి విడత పోలింగ్ సెప్టెంబర్ 18న జరుగుతుంది. ఇందుకోసం ఆగస్టు 20న నోటిఫికేషన్ విడుదలవుతుంది. 27వ తేదీతో నామినేషన్ల గడువు ముగుస్తుంది. 28న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఆగస్టు 30వ తేదీతో ముగుస్తుంది.
రెండో విడత పోలింగ్ సెప్టెంబర్ 25న జరుగుతుంది. ఇందుకోసం ఆగస్టు 29న నోటిఫికేషన్ విడుదలవుతుంది. సెప్టెంబర్ 5వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. సెప్టెంబర్ 6న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. సెప్టెంబర్ 9వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది.
మూడవ విడత పోలింగ్ అక్టోబర్ 1న జరుగుతుంది. దీనితో పోలింగ్ ముగుస్తుంది. ఇందుకోసం సెప్టెంబర్ 5న నోటిఫికేషన్ వెలువడుతుంది. సెప్టెంబర్ 12వ తేదీతో నామినేషన్ల గడువు ముగుస్తుంది. 13న నామినేషన్ల పరిశీలన జరుగతుంది. 17వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. 90 అసెంబ్లీ స్థానాలకు గాను తొలివిడతలో 24 అసెంబ్లీ స్థానాలకు, రెండో విడతలో 26 అసెంబ్లీ స్థానాలకు, మూడో విడతలో 40 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. అక్టోబర్ 4న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల (2024) షెడ్యూల్ ప్రకారం, మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో అక్టోబర్ 1న పోలింగ్ జరుగుతుంది. ఇందుకు గాను, సెప్టెంబర్ 5న నోటీఫికేషన్ విడుదలవుతుంది. సెప్టెంబర్ 12వ తేదీతో నామినేషన్ల గడువు ముగుస్తుంది. సెప్టెంబర్ 13న నామినేషన్ల పరిశీలన, 16వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. అక్టోబర్ 1న పోలింగ్ జరుగనుండగా, అక్టోబర్ 4న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.