జమ్మూ కశ్మీర్లో ఉదంపూర్ జిల్లాలోని దుడు ప్రాంతంలో సోమవారం ఉగ్రవాదులు మెరుపు దాడికి దిగారు. ఈ దాడిలో సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారి మరణించారు. దుడు ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బెటాలియన్ను మరింతగా మోహరించేందుకు భారత సైన్యం చర్యలు చేపట్టింది.
ఆ క్రమంలో బెటాలియన్పై ఉగ్రవాదులు మెరుపు దాడికి దిగి.. కాల్పులు జరిపారు. దీంతో సీఆర్పీఎఫ్ అధికారి మరణించారు. జమ్మూలోని కొండ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు భారత సైన్యం శ్రీకారం చుట్టింది. ఆ ప్రదేశంలో సీఆర్పీఎఫ్ పోస్ట్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాకాలు చేస్తుంది.
అందులోభాగంగా సీఆర్పీఎఫ్ బెటాలియన్.. సోమవారం ఆ ప్రాంతానికి చేరుకుంది. ఈ విషయాన్ని పసిగట్టిన ఉగ్రవాదులు.. సీఆర్పీఎఫ్ బృందంపై మెరుపు దాడికి దిగారు. మరోవైపు ఈ ఏడాది జూన్ నుంచి జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద దాడుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. ఈ దాడుల్లో పలువురు భారత సైన్యానికి చెందిన అధికారులే కాక.. జమ్మూ కశ్మీర్ పోలీసులు సైతం భారీ సంఖ్యలో మరణించారు.
ఈ దాడులకు తామే బాధ్యులమంటూ ఇప్పటికే పాకిస్థాన్కు చెందిన జై షే మహమ్మద్ జేబు సంస్థ కాశ్మీర్ టైగర్ ప్రకటించిన విషయం విధితమే. ఇక జులై 8వ తేదీ కతువా జిల్లాలో ఆర్మీ కాన్వాయిపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు ఆర్మీ సిబ్బంది మరణించారు. అలాగే జులై 6వ తేదీ కుల్గాం జిల్లాలో రెండు వేర్వేరు ఉగ్రవాద దాడుల్లో ఆరుగురు తీవ్రవాదులు మృతి చెందగా, ఇద్దరు సైనికులు సైతం మృతి చెందారు.
రాష్ట్రంలో ఉగ్రవాద దాడులు మరింత పెరగడంతో.. వాటిని అణిచివేసేందుకు మోదీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులోభాగంగా రాష్ట్రంలో ఉగ్రవాద దాడుల నిర్మూలనకు కఠిన చర్యలు అవలంభించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే ఆ రాష్ట్ర ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.