తెలంగాణలో వందలాది మంది రైతులు పిట్టల్లా రాలిపోతుంటే సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఏంటీ?… రాష్ట్రంలో అంత గొప్ప పరిస్థితులు ఏమున్నాయని బర్త్ డే సంబురాలు జరుపుకున్నారు? అంటూ బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ప్రశ్నించారు.
ఒకవేళ అంత సంబురంగా ఉంటే ఇంట్లో చేసుకోవచ్చు కదా? అని ఆమె విస్మయం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ అని చెప్పి… కేసీఆర్ కుటుంబమే బాగుపడింది తప్ప, ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆమె ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమం పుట్టిందే… నీళ్లు, నిధులు, నియమకాల కోసం అని ఆమె గుర్తు చేశారు.
కానీ, కేసీఆర్ అధికారంలో వచ్చినప్పటి నుంచి వాటిని గాలికొదిలేసి, ప్రజాపాలనకు బదులు ఫామ్ హౌస్ పాలన చేస్తున్నడని ఆమె విమర్శించారు. ప్రజలు బాధల్లో ఉంటే మానవత్వం ఉన్నవారెవరూ పుట్టినరోజు వేడుకలు జరుపుకోరు. కానీ, ఆ దొరవారికి పబ్లిసిటీ కావాలి కాబట్టి, దేశం మొత్తం తన ఫ్లెక్సీలు, హోర్డింగులు పెట్టించి.. తనేదో దేశ నాయకుడిలాగా గప్పాలకు పోతుండని ఆమె చెప్పారు.
“ఫ్లెక్సీలు పెడితే నాయకులైపోరు కేసీఆర్… వారు జనం గుండెల్లో నుంచి పుట్టాలి. అది నీకు సాధ్యం కాదు” అని విజయశాంతి స్పష్టం చేశారు. గిరిజనులు తమ భూమి పోతుందని ఆందోళనలు చేస్తుంటే… అది దొరవారికి పట్టదు. తాను మాత్రం దేశానికి ప్రధానమంత్రి కావాలి అంటూ ఆమె ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రిగా ఏం చేశావని ప్రధాని కావాలనుకుంటున్నావు కేసీఆర్? అంటూ ఆమె నిలదీశారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అవి ఏం మీకు పట్టావు. తెలంగాణ వచ్చాక కూడా నియామకాల కోసం.. నిరుద్యోగుల ఆత్మహత్యలు, ఆత్మబలిదానాలు ఆగడం లేదు.. ఉద్యమాలు తప్పడం లేదని ఆమె విచారం వ్యక్తం చేశారు.
రాష్ట్రం వచ్చినా తెలంగాణ యువత తలరాత మారలేదు. సీఎం కేసీఆర్… ఇంకెన్ని ప్రాణాలు బలి తీసుకుంటవ్? అని తెలంగాణ ప్రజానీకం ప్రశ్నిస్తూనే ఉందని విజయశాంతి చెప్పారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఘోరంగా తెలంగాణలో కేసీఆర్ సర్కార్ నియంతృత్వ పాలన సాగుతోందని ఆమె మండిపడ్డారు. కేసీఆర్… నీ దుర్మార్గపు పాలనను తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు. రానున్న రోజుల్లో వారు నీకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారుని విజయశాంతి స్పష్టం చేశారు.