ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పోటీ ప్రధానంగా ముఖ్యమంతి యోగి ఆదిత్యనాథ్, సమాజవాద్ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ల మధ్యనే ఉన్నదనడంలో సందేశం లేదు. ఎన్నికల ప్రచారంలో ఎవ్వరి స్టైల్ వారిదిగా ఉంటుంది. అందరికన్నా విలక్షణంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రచారం జరుగుతున్నది. ఆమెకు పార్టీకి పెద్ద సంఖ్యలో సీట్లను గెలిపించలేక పోయినా ప్రజాభిమానాన్ని మాత్రం విశేషంగా మూటగట్టుకొని అవకాశం ఉంది.
ఆదిత్యనాథ్కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులతో బిఎజిపి అగ్రనేతలు అందరు ప్రచారం చేటున్నారు. 2017 ఎన్నికలలో ప్రధాని మోదీని చూసి ఓట్ వేయమని కోరిన బీజేపీ ఈ సారి మాత్రం యోగిని చూసి వేయమంటున్నది. ప్రధాని కూడా యోగి పాలనను మెచ్చుకోకుండా ఎక్కడా ప్రచారం చేయడం లేదు. వాస్తవానికి గత మూడేళ్ళుగా యోగి ప్రచారం చేస్తున్నట్లే వ్యవహరిస్తూ వస్తున్నది.
ప్రతిరోజూ ఉదయాన్నే లేచే ఆదిత్యనాథ్ తన రోజును ఉదయం 4 గంటలకు పూజలతో ప్రారంభిస్తారు. ఉదయం 6.30 నుంచి అధికారులతో సంభాషిస్తారు. ఉదయం 9.30 నుంచి ర్యాలీలకు హాజరవుతారు. రాత్రి 9 గంటలకు మాత్రమే ఆయన ప్రచారం ముగుస్తుంది. ఆ తర్వాత వ్యూహరచన సమావేశాలు, అధికారిక సమావేశాలు ఉంటాయి.
అయితే అఖిలేష్ ఒకవిధంగా ఒంటరిగా ప్రచారం చేస్తున్నారు. ఆయనకు రాజకీయాలు, పూజలతో పాటు అనేక ఇతర ఆసక్తులు కూడాఉన్నాయి. కుటుంబంతో కాలం గడుపుతూ ఉంటారు. బ్యాడ్మింటన్, ఫుట్బాల్, టెన్నిస్లను ఇష్టపడే క్రీడాకారుడు. అయితే గత రెండు నెలలుగా ఆయన పూర్తిగా ప్రచారానికే అంకితమయ్యారు. జనాలు ఉత్సాహంగా ఉన్నారు.
కఠినమైన షెడ్యూల్ మధ్య ఒత్తిడికి గురవుతున్నట్లు కనిపిస్తున్నారు. మామూలుగా మంచి స్వభావం ఉన్న అఖిలేష్ మీడియా పట్ల కొంచెం అసహనంగా ఉంటారు. అయితే ఈ ఇద్దరు నాయకులు సాధారణ ప్రజలతో అంతగా కలిసిపోలేరు. వారిని యధాలాపంగా, ఆప్యాయంగా పలకరించలేరు.
కానీ ప్రియాంక గాంధీలో నానమ్మ పోలికలు ప్రచారంలో కూడా కనిపిస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఎవ్వరితో అయినా సులభంగా కలిసిపోతారు. ప్రతిపక్షాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు ఎదురు పడినా చిరునవ్వుతో పలకరిస్తుంటారు. అందుకనే ఆమె ఓట్లు పొందలేకపోయినా ప్రజల హృదయాలను మాత్రం గెల్చుకోగలుగుతున్నారని చెప్పుకొంటున్నారు.
ఆమె కొన్ని ఎంపిక చేసిన నియోజకవర్గాలలో ఛత్తీస్ ఘర్ వంటి పొరుగు రాష్ట్రాల నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలను రప్పించి క్షేత్రస్థాయిలో విశేషంగా ప్రచారం అభ్యర్థులతో సంబంధం లేకుండా చాలా ముందునుండే చేపట్టారు. అందుకనే ఈ ఎన్నికలలో ఆమె కాంగ్రెస్ కు యుపిలో ప్రాణం పోయలేక పోయినా, ఒక నాయకురాలిగా, ఎన్నికల ప్రచారంలో ఆమె సిద్దహస్తులుగా ఎదిగిన్నట్లే అని చెప్పవచ్చు.
ఇక మొదటిసారి తండ్రి మరణం అనంతరం మొత్తం పార్టీ భారాన్ని తనభుజాలపై వేసుకొని ప్రచారం చేబడుతున్న ఆర్ ఎల్ డి అధినేత జయంత్ చౌదరి సహితం సమర్ధవంతమైన ప్రచారకర్తగా పేరొందారు. ముఖ్యంగా జాట్ లలో మంచి ప్రభావం తీసుకు రాగలుగుతున్నారు. ఆయన దివంగత తండ్రి అజిత్ సింగ్ కొంచెం రిజర్వ్ గా ఉంది అందరితో కలివిడిగా మాట్లాడ గలిగేవారు కాదు. అయితే జయంత్ మాత్రం చలాకీగా తిరుగుతున్నారు.