పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన గంటలోనే ప్రాజెక్టు పనులను నిర్మాణ సంస్థ నిలిపివేసింది. మంగళవారం మధ్యాహ్నం పోలవరం పనులను మెగా ఇంజనీరింగ్ సంస్థ నిలిపివేసింది. పోలవరం పనుల కోసం గోదావరిలో ఇసుక తవ్వుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా మంగళవారం మధ్యాహ్నం నుంచి మెగా ఇంజనీరింగ్ టిప్పర్లకు ఇసుక ఇవ్వడాన్ని జేపీ వెంచర్స్ ఆపేసింది.
ఇసుక తవ్వుకునేందుకు వీలు లేదని, డబ్బు కట్టాల్సిందేనని కాంట్రాక్టు సంస్థ చెప్పింది. తమకు అనుమతులు ఉన్నాయని పోలవరం నిర్మాణ సంస్థ చెప్పింది. డబ్బు చెల్లించకుండా ఇసుక సరఫరా చేసేది లేదని జెపీ వెంచర్స్ తేల్చి చెప్పింది. ఇసుక ఇవ్వకపోవడంతో టిప్పర్లు వెనక్కి వచ్చాయి. ప్రభుత్వానికి మెగా ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులు ఈ సమాచారాన్ని పంపారు
2023 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని అతను ముందు అసెంబ్లీలో మాట్లాడుతూ సీఎం జగన్ స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ నుండి డిజైన్లు వస్తే ప్రాజెక్టు నిర్మాణాన్ని 18 నెలల్లో పూర్తి చేసేస్తామని భరోసా ఇచ్చారు. ఈ ప్రాజెక్టును వైఎస్ఆర్ ప్రారంభించారని, ఆయన కొడుగ్గా తానే పూర్తిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. సభ్యులు అడిగినట్టు పోలవరం వద్ద వైఎస్ఆర్ విగ్రహం పెడతామని, ప్రాజెక్టును ఆయనకు డెడికేట్ చేస్తామని జగన్ ప్రకటించారు.
పోలవరంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడుతూ పోలవరానికి చంద్రబాబు పనులే శాపంగా మారాయని ధ్వజమెత్తారు. స్పిల్వే నిర్మాణంలో చంద్రబాబు తప్పులు చేశారని ఆరోపించారు. పోలవరం పూర్తవుతుంటే చంద్రబాబుకు కడుపుమంటగా ఉందని చెబుతూ గతంలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ జోలికి చంద్రబాబు వెళ్లలేదని విమర్శించారు.
డిజైన్ ప్రకారం నదిని కుడివైపునకు మళ్లించాలని, అప్పర్, డౌన్ కాఫర్ డ్యాం నిర్మాణ పనుల్లో కొంత వదిలేశారని, దీనివల్ల చాలా నష్టం జరిగిందని జగన్ ఆరోపించారు. వరదల వల్ల 10-25 లక్షల క్యూసెక్కుల నీరు చేరిందని, వరద ఉధృతికి డయాఫ్రొం వాల్ బాగా దెబ్బతిన్నదని, దీన్ని సరిచేయడానికి రెండేళ్లుగా నిపుణులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇదేనా చంద్రబాబు విజయం? అని సీఎం జగన్ ప్రశ్నించారు.