హనుమంతుడి జన్మస్థలం గురించి తిరుమల తిరుపతి దేవస్థానంలోని పండితులు, కర్ణాటకలోని పండితుల మధ్య కొద్దికాలంగా కొనసాగుతున్న వివాదంలో మొదటిసారిగా ఒక రాజకీయ నాయకుడు ప్రవేశించారు. హనుమంతుడి జన్మస్థలం కర్ణాటక అంటూ బిజెపి ఎంపీ తేజస్వి సూర్య చేసిన ప్రకటన మరో రాజకీయ దుమారం రేపే అవకాశం ఉంది.
కర్ణాటకలోని అంజనాద్రి కొండ హనుమంతుడి జన్మస్థలమనితేజస్వీ సూర్య స్పష్టం చేసారు. బెంగళూరు సౌత్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్య బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారత్ దర్శన్ యాత్రలో భాగంగా అంజనాద్రి ఆలయాన్ని సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.
కర్ణాటకలోని విజయనగరం జిల్లా అనెగొండి సమీపంలోని అంజనాద్రి కొండ హనుమంతుని జన్మస్థలం అనే విషయంలో తనకు ఎలాంటి సందేహం లేదని సూర్య స్పష్టం చేశారు. హనుమంతుడి జన్మస్థలంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
“ఇతరులు దీనిపై వేరే వాదనలు చేసినా పర్వాలేదు.. మన కిష్కింద హనుమంతుడి జన్మస్థలం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో అంజనాద్రి కొండ ఉన్నట్లు కనుగొన్నారు. భారతదేశం సంప్రదాయాలను నమ్ముతోంది, వీటిని విస్మరించలేం’’ అని సూర్య పేర్కొన్నారు.
వాల్మీకి రామాయణ రచయిత చేసిన జన్మస్థలం వర్ణన కర్ణాటకలో ఉన్న ప్రాంతానికి చాలా దగ్గరగా ఉందని సూర్య వివరించారు. వాల్మీకి రామాయణం దీనికి సాక్ష్యంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. అంజనాద్రి కొండ సమగ్ర అభివృద్ధికి కర్ణాటక ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందని ఎంపీ సూర్య చెప్పారు.
మరో వైపు తిరుమలలోని అంజనాద్రిపై ఉన్న జాబాలి తీర్థమే హనుమంతుడి జన్మస్థలమని టీటీడీ ప్రకటించింది. హనుమంతుడి జన్మస్థలంపై టీటీడీ ఏర్పాటు చేసిన కమిటీ పలు అంశాలను ఆధారంగా చేసుకొని ఈ విషయాన్ని ప్రకటించింది. పౌరాణిక, వాజ్మయ, శాసన, చారిత్రక ఆధారాలను టీటీడీ ఏర్పాటు చేసిన కమిటీ ఈ విషయాన్ని వెల్లడించింది.