కర్ణాటకలో ఇటీవల చెలరేగిన హలాల్, హిజాబ్ వంటి భావోద్వేగ అంశాలతో ఓటర్లను ఆకట్టుకోవచ్చనే ఆత్రుతతో రాష్ట్ర శాసన సభకు ముందస్తు ఎన్నికలు జరపాలని సంబరపడుతున్న ఆ రాష్ట్ర బిజెపి నాయకులకు పార్టీ కేంద్ర నాయకత్వం ఝలక్ ఇచ్చిన్నట్లు తెలుస్తున్నది. కేవలం ఇటువంటి అంశాలతో గెలుపు సాధ్యం కాదని స్పష్టం చేస్తూ, పరిపాలన పట్ల దృష్టి సారింపమని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి స్పష్టం చేసిన్నట్లు తెలుస్తున్నది.
అంతేకాదు, ముందస్తు ఎన్నికలకు వెళ్లవద్దని, గడుపు ప్రకారమే జరగనీయమని కూడా స్పష్టం చేసిన్నట్లు చెబుతున్నారు. గత కేంద్ర నాయకత్వంతో సమాలోచనలు జరిపి తిరిగి వచ్చిన బొమ్మై ముందు నిర్దిష్ట అజెండాను ఉంచినట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రతిపాదనలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలుపై దృష్టి పెట్టమని సూచించింది.
పైగా, రాష్ట్ర బిజెపి విభాగాన్ని పూర్తిగా పునర్నిర్మించేందుకు సహితం కేంద్రం సిద్దపడుతున్నది. త్వరలో క్రియాశీలంగా రాష్ట్ర అధ్యక్షుడితో పాటు, యువ నాయకత్వాన్ని సమకూర్చే కసరత్తు చేస్తున్నది. మంత్రివర్గ విస్తరణ విషయమై బొమ్మై సమర్పించిన జాబితాను ఇంకా కేంద్రం ఆమోదింప వలసి ఉంది.
చాలా కాలంగా ఎదురుచూస్తున్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ త్వరలో జరుగుతుందని కూడా ముఖ్యమంత్రికి కేంద్రం చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి అరుణ్ సింగ్ (ఏప్రిల్ 12 నుంచి 24 వరకు), పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా (ఏప్రిల్ 16-17) ఈ వారంలో జరుపనున్న కర్ణాటక పర్యటనలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
నడ్డా పర్యటన సందర్భంగా విజయనగరం హోస్పేట్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. పార్టీ వర్గాల కధనం ప్రకారం బొమ్మై నడ్డాతో పాటు హోమ్ మంత్రి అమిత్ షా, ఇతర ముఖ్య నేతలను కలిశారు. మే 2023లో జరుగవలసిన అసెంబ్లీ ఎన్నికలను గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలతో పాటు ఈ సంవత్సరం చివరిలో జరపాలనే కొందరు రాష్ట్ర బిజెపి నేతల ప్రతిపాదనలను వారు తోసిపుచ్చిన్నట్లు తెలుస్తున్నది.
ఇటీవల కాలంలో పార్టీ కోల్పోతున్న రైతుల మద్దతును తిరిగి పొందడం కోసం నీటిపారుదల పనులపై దృష్టి పెట్టమని బొమ్మైకి సూచించినట్లు తెలిసింది. అభివృద్ధిపై మంచి రిపోర్ట్ కార్డ్తో బిజెపి ప్రజల తీర్పు కోరాలన్న ప్రధాని నరేంద్రమోదీ విధానంకు అనుగుణంగా ప్రయత్నం చేయాలని సూచించారు. అంటే భావోద్వేగ అంశాలపైననే ఆధార పడవద్దని సున్నితంగా హెచ్చరించినట్లు అయింది.
హిజాబ్, హలాల్ వంటి అంశాలు హిందూ ఓటర్లను కొంతమేరకు ఏకీకృతం చేయడానికి తోడ్పడినా రాష్ట్రంలో పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే ప్రభుత్వ పనితీరు ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉండాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి స్పష్టం చేశారు.
వివాదాస్పద అంశాల విషయంలో ప్రతి ఒక్కరిని విశ్వాసంలోకి తీసుకున్న తర్వాత తమ ప్రభుత్వం కోర్ట్ ఆదేశాల మేరకు వెడుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేస్తూ వస్తున్నారు. అయితే కొందరు పార్టీ నాయకులు మాత్రం వివాదాస్పద ప్రకటనలు చేస్తుండటాన్ని బొమ్మై కేంద్ర నాయకత్వం దృష్టికి తెచ్చిన్నట్లు తెలుస్తున్నది.
తాజాగా, జాతీయ ప్రధాన కార్యదర్శి సిటి రవి ఇటీవల హిందువులు హలాల్ మాంసాన్ని కొనుగోలు చేయకూడదనే పిలుపును సమర్థిస్తూ, హలాల్ “ఆర్థిక జిహాద్” అని పేర్కొన్నారు. కొందరు సీనియర్ నాయకులు ఆ విధంగా బహిరంగ ప్రకటనలు చేస్తుండటం రాష్ట్రంలో ప్రభుత్వంకు ఇబ్బందులు కలిగిస్తున్నట్లు కూడా కేంద్ర నాయకత్వం పరిగణలోకి తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
కోర్ట్ పరిధిలో ఉన్న అంశాలపై పార్టీ నాయకులు ఇటువంటి ప్రకటనలు చేస్తుండటం పట్ల నడ్డాతో పాటు పలువురు కేంద్ర నాయకులు కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాగా, రాబోయే రోజులలో ప్రధాని మోదీ తరచూ రాష్ట్రంలో పర్యటిస్తూ వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలలో పాలగొంటారని చెబుతున్నారు. ముఖ్యంగా బిజెపికి బలమైన ఉత్తర కర్ణాటకలో పార్టీ కార్యకర్తలలో, నాయకులలో పెరుగుతున్న అసంతృప్తి పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర నేతలకు కేంద్రం సూచించింది.