ఇంతకు ముందు తరం ఎదుర్కొన్న బాధలను నేటి తరం కాశ్మీరీ యువత చవిచూడ రాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. జమ్ము ప్రాంతంలోని సాంబా జిల్లాలో ఆదివారం జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ సభలో ఆయన పాల్గొంటూ రూ.20 వేల కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు.
అభివృద్ధి ద్వారా ‘ఢిల్లీ నుంచి దూరాన్ని’ తగ్గించే లక్ష్యంతో ఈ పనులను చేపట్టినట్టు ఆయన అభివర్ణించారు. ఆగష్టు, 2019లో జమ్ముకాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి కేంద్ర ప్రాంతాలుగా విడగొడ్డిన తర్వాత ప్రధానమంత్రి పర్యటించడం ఇదే తొలిసారి. సాంబా సభలో ప్రధాని ప్రసంగిస్తూ ‘నా మాటలు నమ్మాల్సిందిగా జమ్ముకాశ్మీర్ యువతను కోరుతున్నా. మీ తల్లిదండ్రులు, మీ తాతవ్వలు ఎదుర్కొన్న బాధలను మీరు పడకూడదు. అలా చేస్తానని మీకు వాగ్దానం చేస్తున్నా’ అని పేర్కొన్నారు.
`ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కింద ప్రత్యేక శ్రద్ధతో గత 8 ఏళ్లుగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, తద్వారా సాంస్కృతికంగా, భాషా పరంగా ఉన్న ఎడబాటును, ఢిల్లీ దూరమనే భావనను తగ్గిస్తూ వచ్చామని ఆయన తెలిపారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జమ్ముకాశ్మీర్లో నిర్వహించుకోవడం గణనీయమైన మార్పుకు నిదర్శనమని చెప్పుకొచ్చారు.
కార్బన్ రహితంగా రూపుదిద్దుకున్న ‘పల్లి’ గ్రామం పర్యావరణ హిత కోసం గ్లాసోగోవ్లో నిర్దేశించుకున్న లక్ష్యాలకు సజీవ ఉదాహరణ అని ఆయన ప్రశంసించారు. జమ్ముకాశ్మీర్, లడఖ్లో చేపడుతున్న అనుసంధాన ప్రాజెక్టులు ద్వారా ఢిల్లీకి దూరం తగ్గుతుందని, శ్రీనగర్ – ఢిల్లీ రహదారి ప్రాజెక్టు ఇప్పటికే ప్రయాణ సమయాన్ని రెండు గంటలకు తగ్గించిందని తెలిపారు.
కన్యాకుమారి దేవీ నుంచి వైష్ణో దేవీకి రోడ్డు మార్గం ద్వారా అనుసంధానించే రోజు ఎంతో దూరంలో లేదని ప్రధాని చెప్పుకొచ్చారు. రాబోయే 25 ఏళ్లలో జమ్ముకాశ్మీర్లో అభివృద్ధి నవశకాన్ని సృష్టిస్తుందని తెలిపారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ (యుఎఇ) పెట్టుబడిదారులు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.
గత 70 ఏళ్లలో కేవలం రూ.17 వేల కోట్లు పెట్టుబడులు వస్తే, గడిచిన రెండేళ్లలోనే రూ.38 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆయన చెప్పారు. పర్యాటక రంగం కూడా గణనీయంగా అభివృద్ధి చెందనుందని తెలిపారు. ప్రధాని తన పర్యటనలో భాగంగా 850 మెగావాట్ల సామర్థ్యంతో చేపట్టనున్న రాట్లే పవర్ ప్రాజెక్టుకు, 540 మెగావాట్ల సామర్థ్యంతో చేపట్టనున్న క్వార్ హైడ్రో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. జమ్ముకాశ్మీర్లో త్వరలోని విద్యుత్ మిగులు సాధిస్తుందని తెలిపారు.
ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించిన 2019 ఆగస్టు 5 తర్వాత జమ్ముకాశ్మీర్లో 175 కేంద్ర చట్టాలను అమల్జేస్తుండటం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. దీనివల్ల మహిళలకు, దళితులకు, బల్మికి తదితరులకు ప్రయోజనం చేకూరిందని, 70 ఏళ్ల ‘అజాదీ (స్వేచ్ఛ)’ తర్వాత వారికి ‘అజాదీ’ లభిస్తోందన్నారు.