తమిళనాడును విభజించే కుట్ర జరుగుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కే.స్టాలిన్ ఆరోపించారు. కులమతాల ప్రాతిపదికన తమిళ ప్రజలను విడగొట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. తద్వారా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని హెచ్చరించారు.
ప్రజలు దీన్ని అర్థం చేసుకుని, ఇలాంటి కుట్రలను తిప్పికొట్టాలని ఆయన పిలుపిచ్చారు. రాష్ట్ర ప్రజలందరూ ఐకమత్యంగా ఉండాలని కోరారు. చెన్నైలో ఓ ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కుల, మతాల ప్రాతిపదికన విభజించడం ద్వారా తమిళ జాతికి ముగింపు పలకొచ్చని, మన అభివృద్ధిని అడ్డుకోవచ్చని కొంతమంది అనుకుంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.
ఆ ఉచ్చులో పడకూడదని, అటువంటి ప్రయత్నాల వెనుక దాగి ఉన్న కుట్రలను పసిగట్టాలని స్టాలిన్ స్పష్టం చేశారు. వివాదాస్పద పౌరసత్వ చట్టం సవరణ (సీఏఏ) బిల్లు విషయంలో విపక్ష అన్నాడీఎంకే వ్యవహరించిన తీరు మీద కూడా స్టాలిన్ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
మన రాజ్యాంగంలోని లౌకిక విలువలకు సీఏఏ విరుద్ధమన్న ఆయన గతేడాది తమిళనాడు అసెంబ్లీలో తమ పార్టీ తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తాము సీఏఏను వ్యతిరేకించామని, ఆ బిల్లుకు వ్యతిరేకంగా ప్రచారం కూడా చేశామని పేర్కొన్నారు.
కానీ అన్నాడీఎంకే సీఏఏకు అనుకూలంగా ఓటు వేసిందని తెలిపారు. తమ స్వదేశాలను వదిలి ఇక్కడకు వచ్చిన శరణార్థులను ఆదుకోవాల్సింది పోయి.. మతం పేరుతో వారిపై వివక్ష చూపడం సరికాదని స్టాలిన్ స్పష్టం చేశారు.
గవర్నర్ అధికారాలకు కొత
మరోవంక, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల నియామకంలో రాష్ట్ర గవర్నర్కు ఉన్న అధికారాలను తొలగించేలా తమిళనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వర్శిటీల వీసీలను రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణలు చేస్తూ అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కె. పొన్నుడి సోమవారం ఈ బిల్లును శాసన సభలో ప్రవేశ పెట్టారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ బిల్లుపై మాట్లాడుతూ.. “సంప్రదాయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి గవర్నర్ వర్శిటీల వైస్ ఛాన్సలర్లను నియమిస్తారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా గవర్నర్లు దాన్ని తమ ప్రత్యేక హక్కు అన్నట్టు వ్యవహరిస్తున్నారు” అని గుర్తు చేశారు.
“ఇది ప్రభుత్వాన్ని అగౌరవ పర్చడమే గాక, ప్రజాస్వామ్య విధానానికి విరుద్ధం. అంతేకాక, వైస్ ఛాన్సలర్ల నియామకం విషయంలో ప్రభుత్వానికి అధికారం లేకపోవడం ఉన్నత విద్యపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. విశ్వవిద్యాలయ పాలనా వ్యవహారాల్లోనూ గందరగోళం సృష్టిస్తోంది” అని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా 2010 మాజీ సీజేఐ మదన్మోహన్ పూంచీ నేతృత్వంలోని కమిషన్ ఇచ్చిన నివేదికను స్టాలిన్ ప్రస్తావించారు. యూనివర్శిటీల ఛాన్సలర్ పదవి నుంచి గవర్నర్ను తొలగించాలని ఆ కమిటీ సిఫార్సు చేసినట్టు గుర్తు చేశారు.
“అంతెందుకు.. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లోనూ వీసీలను గవర్నర్ నేరుగా నియమించరు. రాష్ట్ర ప్రభుత్వ కమిటీ సిఫార్సు చేసిన ముగ్గురు అభ్యర్థుల్లో ఒకరిని వీసీగా ఎంచుకుంటారు.” అని స్టాలిన్ పేర్కొన్నారు.