కర్నాటకలో సంచలన వివాదానికి దారితీసిన హిజాబ్ అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తంచేసింది. కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు మంగళవారం అంగీకరించింది. పిటిషనర్లలో ఒకరి తరఫున సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోరా ఈ విషయాన్ని సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఉందని సీజేఐ ఎన్వి రమణ, న్యాయమూర్తులు కృష్ణమురారి, హిమా కోహ్లితో కూడిన ధర్మాసనాన్ని కోరారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ, ఈ పిటిషన్ను జాబితా చేస్తామని చెప్పారు. రెండు రోజులు వేచివుండాలని కోరారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం హిజాబ్ ధరించడం తప్పనిసరి మతపరమైన ఆచారంలో భాగం కాదంటూ కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది. దీనిని సవాల్చేస్తూ సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. స్కూల్ యూనిఫాం ప్రిస్కిప్షన్ అనేది ఒక సహేతుకమైన పరిమితి మాత్రమేనని, రాజ్యాంగబద్ధంగా అనుమతించదగినదేనని, దీనికి విద్యార్థులు అభ్యంతరం చెప్పజాలరని హైకోర్టు పేర్కొంది.
ఈ సందర్భంగా మతస్వేచ్ఛ, మనస్సాక్షి స్వేచ్ఛ అనే ద్వంద్వాన్ని సృష్టించిన పిటిషన్ను కోర్టు తప్పుబట్టింది. మతాన్ని అనుసరించే వారికి మనస్సాక్షి హక్కు ఉండదని కోర్టు భావించింది. 5 ఫిబ్రవరి 2022 నాటి ఆర్డర్ సహేతుకమేనని, ఆ అధికారం ప్రభుత్వానికి ఉందని, దాని చెల్లుబాటు కోసం ఎలాంటి కేసు పెట్టడానికి వీల్లేదని హైకోర్టు పేర్కొంది.
రామనవమి ‘అల్లర్ల’ పిటిషన్పై అసహనం
అయితే, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ఘర్షణలపై విచారణకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటును కోరుతూ చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మాజీ సీజేఐలు ఎవరూ ఖాళీగా లేరంటూ పిటిషనర్పై అసహనం వ్యక్తంచేసింది.
ఇటీవల హనుమాన్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని జహంగీర్పురిలో శోభయాత్ర ఉద్రిక్తతలకు దారితీసింది. రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులకు పాల్పడిన వీడియోలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘర్షణల్లో పోలీసులు సహా పలువురు పౌరులు గాయపడ్డారు.
ఈ ఘటన కంటే కొద్ది రోజుల ముందు శ్రీరామ నవమి సందర్భంగా గుజరాత్, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, రాజస్థాన్, బెంగాల్ రాష్ట్రాల్లో మత ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలపై న్యాయపరమైన దర్యాప్తు చేపట్టేలా ఆదేశాలివ్వాలని కోరుతూ విశాల్ తివారీ అనే న్యాయవాది సుప్రీంను ఆశ్రయించారు. ఈ అల్లర్లపై దర్యాప్తునకు మాజీ సీజేఐ నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవాయ్లతో కూడిన ధర్మాననం పిటిషన్దారుపై అసహనం వ్యక్తంచేసింది. ఇక్కడ ఎవరైనా ఖాళీగా ఉన్నారా? ఇలాంటివి అభ్యర్థించకండి. ఈ పిటిషన్ను కొట్టివేస్తున్నాం అని ధర్మాసనం స్పష్టం చేసింది.