ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటూ కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి ఎట్టకేలకు తెరపడింది. గత ఏడాది కూడా ఇటువంటి ప్రచారం జరిగి, అర్ధాంతరంగా ముగియడం గమనార్హం. ఆ పార్టీని వారే బాగుచేసుకోవాలి అంటూ ఒక విధంగా తన నిస్సహాయతను కిషోర్ వ్యక్తం చేయడం గమనార్హం.
‘సాధికారిత కమిటీలో భాగంగా పార్టీలో చేరాలని, 2024 పార్లమెంట్ ఎన్నికల బాధ్యతలు తీసుకోవాలని కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్ను తిరస్కరించాను. నా అభిప్రాయం ప్రకారం.. కాంగ్రెస్లో లోతుగా పాతుకుపోయిన నిర్మాణపరమైన సమస్యలను పరిష్కరించడానికి నా అవసరం కన్నా.. పార్టీకి నాయకత్వం, సమిష్టి సంకల్పం అవసరం’ అని ఈ సందర్భంగా ఆయన పేర్కొనడం గమనార్హం.
వరుసగా కాంగ్రెస్ అగ్రనేతలతో జరిపిన భేటీలతో ఆయన విసుగు చెందారా? వారు పెట్టిన షరతులకు జంకారా? లేదా కిషోర్ పార్టీకి పట్ల గల `విధేయత’ పట్ల కాంగ్రెస్ నేతలే ఓ నిర్ధారణకు రాలేక పోయారా? అనే అనుమానాలు ఈ సందర్భంగా వ్యక్తం అవుతున్నాయి.
ఇతర పార్టీలతో పొత్తులు, అభ్యర్థుల ఎంపికలో తనకు పూర్తి స్వేచ్ఛ కావాలని ఆయన పట్టుబడుతూ ఉండగా, కాంగ్రెస్ లో చేరిన తర్వాత మరే ఇతర పార్టీకి ఆయన ఎన్నికల వ్యూహాల గురించిన సలహా ఇవ్వరాదని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.
పైగా, ఇప్పటి వరకు తాను వ్యూహకర్తగా సేవలు అందిస్తున్న తృణమూల్ కాంగ్రెస్, వైసిపి, టి ఆర్ ఎస్ లతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవాలని కిషోర్ చేసిన ప్రతిపాదనల పట్ల ఆయా పార్టీల నుండి సానుకూలత వ్యక్తం కాలేదు.
ఇటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ లో చేరితో ఓ ఊబిలో చిక్కుకున్నట్లే అని కిషోర్ భావించారా? అనే ప్రశ్న తలెత్తుతుంది. నిజంగా ఆ పార్టీలో చేరే ఉద్దేశ్యం లేని పక్షంలో గత కొన్ని రోజులుగా మీడియాలో జరుగుతున్న ప్రచారం పట్ల, కొందరు కాంగ్రెస్ నేతల ప్రకటనల పట్ల ఆయన మౌనంగా ఉండే అవకాశం లేదు.
ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్లో చేరడం లేదని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా అంతకు ముందు ట్విట్టర్ ద్వారా తెలిపారు. కాగా, ప్రజెంటేషన్ను కాంగ్రెస్ సమీక్షిచిందని రణదీప్ పేర్కొన్నారు. ‘ ప్రశాంత్ ఇచ్చిన ప్రజెంటేషన్పై ఆయనతో చర్చలు జరిపాం. కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ 2024ని ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్లో భాగంగా పార్టీలో చేరాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. ఆయన నిరాకరించారు. పార్టీకి ఆయన ఇచ్చిన సలహాలు, సూచనలు అభినందిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.