ప్రస్తుత వేగవంతమైన సమాచార యుగంలో మాట పెదవి దాటే లోపు, సమాచారం పృథివి దాటుతోందని అందుకే ఇచ్చే సమాచారం సరైనదా కాదా అనేది ఎప్పటికప్పుడు సరి చూసుకోవలసిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మీడియాకు సూచించారు.
మీడియా అనేది అద్దం లాంటిదని అది సమాజాన్ని ప్రతిబింబించడంతో పాటుగా సమాజంలో సానుకూల మార్పునకు కృషి చేయాలని తెలిపారు. ఎన్ని పత్రికలు, ప్రసార మాధ్యమాలు ఈ దిశగా స్వీయ నియంత్రణతో పనిచేస్తున్నాయనేది ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు చెప్పారు. బుధవారం నెల్లూరు జిల్లా కేంద్రంలోని నెల్లూరు ఆలిండియా రేడియో కేంద్రాన్ని జాతికి అంకితం చేసిన అనంతరం, 100 మీటర్ల 10 కిలోవాట్ల ఎఫ్ఎం స్టేషన్ కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విక్రమ సింహపురికి, ఆకాశవాణికి 6 దశాబ్దాలుగా ఉన్న అవినాభావ సంబంధాన్ని, ఇక్కడి ప్రజల జీవితాల్లో రేడియో పాత్రను ప్రస్తావిస్తూ మీడియాకు పలు సూచనలు చేశారు. ప్రచార, ప్రసార మాధ్యమాలు అందించే వార్తలు సత్యానికి దగ్గరగా, సంచలనానికి దూరంగా ఉండేలా చూసుకోవాలని చెప్పారు.
పత్రికా స్వేచ్ఛ ద్వారానే సమాజం, ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుందని స్పష్టం చేశారు. అయితే ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేసే వారి విషయంలో మాత్రం ప్రజలు కఠినంగా వ్యవహరించే పరిస్థితి రావాలని ఆయన పేర్కొన్నారు.
మాధ్యమాల్లో, మరీ ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తల్లో నిజానిజాలు తేల్చడానికి ప్రభుత్వ పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) ఒక నిజనిర్ధారణ విభాగాన్ని ఏర్పాటు చేయాల్సి రావడం పరిస్థితి తీవ్రతను ప్రతిబింబిస్తుందని తెలిపారు.
నైతికత పునాదుల మీద జర్నలిజం భవిష్యత్తు ముందు సాగాలని ఆకాంక్షించే వారిలో తాను మొదటివరుసలో ఉంటానన్న ఉపరాష్ట్రపతి, అలాంటి జర్నలిజానికి ప్రజలు సైతం ప్రోత్సాహం అందించాలని కోరారు. సంస్కృతి, సంప్రదాయాలు, సంగీతం, వ్యవసాయం వంటి వాటికి పత్రికలు, మీడియా, సామాజిక మాధ్యమాలు మరింత ప్రాధాన్యత కల్పించాలని చెప్పారు.