దేశద్రోహాన్ని నేరంగా పరిగణించే భారతీయ శిక్షాస్మఅతి (ఐపిసి)లోని సెక్షన్ 124 ఎ ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై ఏప్రిల్ 30లోగా తన స్పందనను దాఖలు చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతఅత్వంలోని ధర్మాసనం కేసును మే 5న తుది విచారణకు జాబితా చేయాలని నిర్ణయించింది.
ఎటువంటి వాయిదా ఇవ్వబోమని స్పష్టం చేసింది. ”ఈ వారం చివరిలోగా స్పందన దాఖలు చేయాలని మేము కేంద్రాన్ని ఆదేశిస్తున్నాము. మంగళవారంలోగా దాఖలు చేయాల్సిన అఫిడవిట్కు స్పందన ఇవ్వండి. మే 5న ఎలాంటి వాయిదా లేకుండా తుది పరిష్కారానకి సంబంధించిన అంశాన్ని జాబితా చేయండి” అని సుప్రీం కోర్టు ఆమోదించిన ఉత్తర్వులో పేర్కొంది.
ఐపిసిలోని సెక్షన్ 124ఏ రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ, దాన్ని రద్దు చేయాలని కోరుతూ రెండు రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. రిటైర్డ్ ఆర్మీ మేజర్ జనరల్ ఎస్జి వోంబట్కేరే, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లి ధర్మాసనం విచారణ జరుపుతోంది.
సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల్లో పోస్ట్లు, కార్టూన్ల పోస్టు చేసిన ఇద్దరు జర్నలిస్టులు, కిషోర్చంద్ర వాంగ్ఖేంచా, కన్హయ్య లాల్ శుక్లాపై గత ఏడాది ఏప్రిల్లో దేశద్రోహ నేరం అభియోగాలు మోపిన తరువాత ఈ నిబంధనపై సవాల్ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం హామీ ఇవ్వబడిన వాక్ స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణపై ఒక వ్యక్తి హక్కును ఇది ఉల్లంఘిస్తుందనే కారణంతో వారు ఈ నిబంధనను సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
2021 జూలైలో ఈ అంశంపై నోటీసు జారీ చేసిన సుప్రీం కోర్టు స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తరువాత ఈ చట్టం అవసరమా? అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బ్రిటిష్ వలస పాలకులు దేశ స్వాతంత్య్ర సమర యోధులను అణచివేసేందుకు ఉపయోగించిన నిబంధనను ఎందుకు రద్దు చేయడం లేదని సుప్రీం కోర్టు గత సంవత్సరం ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ప్రస్తుతం ఈ నిబంధన దుర్వినియోగమవుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. దేశానికి స్వాతంత్య్రం రాకముందు మహాత్మా గాంధీ, బాలగంగాధర తిలక్ వంటి స్వాతంత్య్ర సమరయోధుల గొంతును అణిచివేసేందుకు బ్రిటిష్ వారు ఈ నిబంధనను ఉపయోగించారని కోర్టు హైలైట్ చేసింది.
మరొకరి అభిప్రాయాలను ఎవరైనా ఇష్టపడనప్పుడు, కార్యనిర్వాహక విభాగం నుంచి జవాబుదారీతనం లేనప్పుడు అది దుర్వినియోగం చేయబడుతుందని సిజెఐ ఎన్వి రమణ స్పష్టం చేశారు. నేరారోపణలు రుజువవుతున్న సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపింది.
ఐపిసి సెక్షన్ 124ఏ ఎంతగా దుర్వినియోగమవుతోందంటే, ఓ వడ్రంగి చేతికి రంపం ఇస్తే, ఆయన చెట్టును కోయడానికి బదులుగా, మొత్తం అడవిని కోసినట్లు ఉందని వ్యాఖ్యానించింది. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సిఆర్బి) గణాంకాల ప్రకారం 2016 నుంచి 2019 మధ్య కాలంలో ఈ కేసుల సంఖ్య 93, అంటే అంతకుముందు కన్నా 160 శాతం పెరుగుదల కనిపించింది.
2019లో 3.3 శాతం కేసులు మాత్రమే రుజువయ్యాయి. కేవలం ఇద్దరు నిందితులపై మాత్రమే నేరం రుజువైంది. ఐపిసి లోని సెక్షన్ 124ఏ రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై స్పందించేందుకు సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీం కోర్టుకు తెలిపింది. దీంతో అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి ఈ వారాంతం వరకు గడువు ఇచ్చింది. మే 5న తదుపరి విచారణ జరుగుతుందని తెలిపింది.