కర్ణాటకలో మండ్య నియోజకవర్గానికి స్వతంత్ర ఎంపీగా కొనసాగుతున్న ప్రముఖ సినీ నటి సుమలతా అంబరీష్ (58) బీజేపీలో చేరేందుకు సుముఖత ఆసక్తి వ్యక్తపరుస్తున్నట్లు తెలుస్తోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో మండ్య నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సుమలతను జిల్లా ప్రజలు సాదరంగా స్వాగతించారు.
కాంగ్రెస్, జేడీఎస్ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, అప్పటి ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్కుమార్పై 1.25 లక్షల ఓట్ల ఆధిక్యతతో ఆమె సంచలన విజయం సాధించారు.
ఆ సమయంలో ఆమెపై బిజెపి అభ్యర్థిని పోటీకి దింపకుండా, ఆమెకు మద్దతు ఇచ్చింది. ఎన్నికల అనంతరమే ఆమె బీజేపీలో చేరనున్నారని, ఆమెను కేంద్ర మంత్రివర్గంలో తీసుకోనున్నారని వార్తలు వచ్చినా కార్యరూపం దాల్చలేదు. సుమలత భర్త అంబరీష్ ప్రసిద్ధ కన్నడ నటుడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాక ఇటు రాష్ట్రం, అటు కేంద్రంలోను మంత్రిగా వ్యవహరించారు.
మండ్య జిల్లా నుంచి అంబరీష్ సుధీర్ఘకాలం పాటు రాజకీయాల్లో కొనసాగారు. మూడు సార్లు ఎంపీగా గెలుపొందారు. మొదటి రెండుసార్లు జేడీఎస్ అభ్యర్థిగా, మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. అదే అభిమానంతో సుమలత స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు.
మరో రెండేళ్ల తర్వాత లోక్సభకు ఎన్నికలు రానున్నాయి. ఈలోగానే వచ్చే ఏడాది రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. కుమారుడు అభిషేక్ను రాజకీయాల్లోకి తీసుకు రావాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. మద్దూరు నుంచి అభిషేక్ అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
మద్దూరు నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ను అగ్ర రాజకీయ నేత ఎస్ఎం కృష్ణ సోదరుడు గురుచరణ్కు ఇవ్వడం దాదాపు ఖరారైంది. ఇదే విషయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా ప్రకటించారు. దానితో సుమలత బీజేపీలో వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు చెబుతున్నారు.
ఇదే విషయమై గడిచిన వారం పది రోజులుగా మండ్య జిల్లాకు చెందిన ఆప్తులతో ఆమె మంతనాలు జరిపి బీజేపీలో వెళ్లే విషయం ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయమై ఆమె ఇప్పటి వరకు అధికారికంగా ఏమీ చెప్పకపోయినా, పలువురు బిజెపి నాయకులను కలుస్తూ ఉండటంతో ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
గత సోమవారం ఓ వివాహం సందర్భంగా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను కలుసుకొని, మాట్లాడటం గమనార్హం. రాష్ట్రంలో 28 ఎంపీ సీట్లలో 25 గెల్చుకున్నప్పటికీ బిజెపికి మండ్య జిల్లాలో బలమైన నాయకత్వం లేదు. ఆమెను తమ పార్టీలో చేర్చుకోవాలని బిజెపితో పాటు కాంగ్రెస్ కూడా ఆశాంతిగా ఉన్నప్పటికీ ఆమె కాంగ్రెస్ పత్తి ఆసక్తి చూపడం లేదని తెలుస్తున్నది.
భర్త మరణం అనంతరం 2019లో రాజకీయ ప్రవేశం చేసి, పోటీ చేయాలి అనుకున్నప్పుడు ఆ సీట్ జేడీఎస్ కు కేటాయించడంతో పార్టీ సీట్ ఇవ్వలేమని కాంగ్రెస్ చెప్పడంతో ఆమె ఇంకా ఆగ్రహంగా ఉన్నట్లు కనిపిస్తున్నది. అయితే కొడుకు సినిమాలతో తీరిక లేకుండా ఉన్నాడని, ఇప్పుడే రాజకీయాలలోకి రావాలని లేదని ఆమె చెబుతున్నారు. తాను బీజేపీలో చేరే విషయం ఎన్నికల ముందు చూసుకోవచ్చు అనే ధోరణిలో ఉన్నారని ఆమె సన్నిహితులు భావిస్తున్నారు.