దేశంలో పెద్ద ఎత్తున విద్యుత్ కోతలు చోటుచేసుకుంటుండంతో మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరం కేంద్రాన్ని నిలదీశారు. ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో అనేక రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయి. థర్మల్ ప్లాంట్లకు బొగ్గు కొరత కారణం కావడంతో కేంద్రాన్ని ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి.
చిదంబరం ఈ విషయంపై ఇంకా ప్రభుత్వాన్నిప్రశ్నిస్తూ “కావలసినంత బొగ్గు, రైల్ నెట్వర్క్, పూర్తి సామర్థాన్ని ఉపయోగించని థర్మల్ ప్లాంట్స్ ఉన్నాయి. అయినా, తీవ్ర విద్యుత్ కొరత నెలకొని ఉంది. ఇందుకు మోదీ ప్రభుత్వాన్ని విమర్శించకూడదు. ఎందుకంటే దీనకంతటికీ 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనే కారణం” అంటూ మర్మగర్భంగా ఎద్దేవా చేశారు.
“బొగ్గు మంత్రిత్వ శాఖ ఉంది, రైల్వే మంత్రిత్వ శాఖ ఉంది, విద్యుత్ మంత్రిత్వ శాఖ ఉంది. అయితే తప్పంతా కాంగ్రెస్దేనని ఆ శాఖ మంత్రులు చేతులు దులిపేసుకుంటున్నారు” అని చిదంబరం చురకంటించారు.
విద్యుత్ అంతరాయానికి సరైన పరిష్కారాన్ని కనుగొందని.. అదేంటంటే ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసి.. బొగ్గును తరలించే రైళ్లను నడపడమని ఎద్దేవా చేశారు. “ ప్రభుత్వం మంచి పరిష్కారాన్నే కనుగొంది. ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసి, కోల్ రేక్స్ నడుపుతున్నారు. మోదీహై, ముమ్కిన్ హై” అంటూ మాజీ కేంద్ర మంత్రి ట్వీట్ల పరంపరను కొనసాగించారు.
కాగా, దేశమంతా విద్యుత్ తీవ్ర సంక్షోభంలో ఇప్పుడు కొట్టుమిట్టాడుతుండగా ఈ వైఫల్యానికి కారణం ఎవరిపై నిందవేస్తారని ప్రధాని మోదీని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిలదీశారు. మాజీ ప్రధాని నెహ్రూ లేదా రాష్ట్ర ప్రభుత్వాలా, లేదా దేశ ప్రజలా ఎవరు ఈ వైఫల్యానికి కారకులని నిందిస్తారని ఎద్దేవా చేశారు. ప్రధాని హామీలకు, ఆలోచనలకు ఎక్కడా సంబంధం ఉండదని విమర్శించారు.
2017 నాటికి దేశంలో విద్యుత్ సంక్షోభం ఉండబోదని , పతాకశీర్షికల్లో విద్యుత్ సంక్షోభం అన్నదే కనిపించదని, 24 గంటలూ విద్యుత్ సరఫరా ఉంటుందని 2015 లో ప్రధాని మోదీ తన ప్రసంగాల్లో ఇచ్చిన హామీల వీడియో క్లిప్పింగ్లను కూడా ఈ సందర్భంగా రాహుల్ టాగ్ చేశారు.
ఇదిలావుండగా విద్యుత్ కోతలపై ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్రానిదే బాధ్యత అంటూ దుమ్మెతిపోస్తున్నారు. విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా చేయకుండా నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు.