న్యాయస్థానాల్లో స్థానిక భాషలను ప్రోత్సహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. తద్వారా ప్రజలు న్యాయ ప్రక్రియతో అనుసంధానమైనట్లు భావిస్తారని, వారిలో విశ్వాసం పెరుగుతుందని చెప్పారు. అంతిమంగా న్యాయ ప్రక్రియపై ప్రజల హక్కు బలపడుతుందని తెలిపారు.
ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, లెఫ్టినెంట్ గవర్నర్ల 11వ సంయుక్త సదస్సును శనివారం ప్రారంభిస్తూ ఇప్పటికే సాంకేతిక విద్యలో స్థానిక భాషలను ప్రోత్సహిస్తున్నట్లు గుర్తుచేశారు. చట్టాల గురించి సులభమైన భాషలో అర్థమయ్యేలా వివరించాలని కోరారు. అండర్ ట్రయల్ ఖైదీల కేసులకు ప్రాధాన్యం ఇవ్వాలని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు సూచించారు.
‘‘దేశంలో న్యాయవ్యవస్థ రాజ్యాంగ సంరక్షకుడి పాత్ర పోషిస్తోంది. సీఎంలు, సీజేల సంయుక్త సదస్సు రాజ్యాంగ సౌందర్యానికి నిలువెత్తు నిదర్శనం. నేను చాలాకాలంగా ఈ సదస్సుకు వస్తున్నా. మొదట ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రధానమంత్రిగా సదస్సుకు హాజరవుతున్నా. ఒకరకంగా చెప్పాలంటే ఈ సదస్సు విషయంలో నేను చాలా సీనియర్ని” అంటూ పేర్కొన్నారు.
డిజిటల్ ఇండియా మిషన్లో భాగంగా న్యాయ వ్యవస్థలో సాంకేతికతకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం భావిస్తోందని చెబుతూ దీన్ని సీఎంలు, ప్రధాన న్యాయమూర్తులు మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈ–కోర్టుల ప్రాజెక్టును మిషన్ మోడ్లో అమలు చేస్తున్నామని తెలుపుతూ న్యాయ వ్యవస్థతో డిజిటల్ ఇండియాను అనుసంధానించాలని సూచించారు.
బ్లాక్చెయిన్లు, ఎలక్ట్రానిక్ డిస్కవరీ, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోఎథిక్స్ వంటి సబ్జెక్టులను అనేక దేశాల్లో న్యాయ విశ్వవిద్యాలయాల్లో బోధిస్తున్నారని పేర్కొంటూ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారత్లోనూ న్యాయ విద్యను అందించడం మన బాధ్యత అని ప్రధాని స్పష్టం చేశారు.
చట్టాల్లో సంక్లిష్టతలు, వాడుకలో లేని చట్టాలు చాలా ఉన్నాయని అంటూ 2015లో ప్రభుత్వం 1,800 చట్టాలను అప్రస్తుతంగా గుర్తించగా, ఇప్పటికే 1,450 చట్టాలను రద్దు చేశామని మోదీ తెలిపారు. స్థానిక కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఒక ముఖ్యమైన సాధనం అని తెలిపారు.
మన సమాజంలో మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడం వేల సంవత్సరాలుగా ఒక సంప్రదాయంగా కొనసాగుతోందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మధ్యవర్తిత్వ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిందని ప్రధాని చేప్పారు.
మన దేశం స్వాతంత్య్రం పొంది 2047 నాటికి 100 ఏళ్లు పూర్తవుతుంది. అప్పుడు దేశంలో ఎలాంటి న్యాయ వ్యవస్థను చూడాలనుకుంటున్నాం? 2047 నాటికి దేశ ఆకాంక్షలను నెరవేర్చగలిగేలా మన న్యాయ వ్యవస్థను ఎలా సమర్థంగా తీర్చిదిద్దాలి? ఈ ప్రశ్నలే ఈ రోజు ప్రాధాన్యతగా ఉండాలని ప్రధాని సూచించారు.
అమృత్ కాల్లో మన విజన్ (దార్శనికత) అంతా సులభ న్యాయం, సత్వర న్యాయం, సమ న్యాయం కల్పించే న్యాయ వ్యవస్థపై ఉండాలి. న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు, మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. వివిధ స్థాయిల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నామని ప్రధాని హామీ ఇచ్చారు.